అమ్మకాల్లో ఆల్టోను దాటిన డిజైర్‌

Maruti's Dzire overtakes Alto as best selling PV model in July - Sakshi

టాప్‌ 10లో ఆరు మారుతీవే..

న్యూఢిల్లీ: గత నెలలో అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్‌ వాహనంగా దేశీ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా  కాంపాక్ట్‌ సెడాన్‌ కారు డిజైర్‌ అగ్రస్థానంలో నిల్చింది. ఈ క్రమంలో మారుతీకే చెందిన ఎంట్రీ లెవెల్‌ చిన్న కారు ఆల్టోను అధిగమించింది. సియామ్‌ గణాంకాల ప్రకారం జులైలో డిజైర్‌ అమ్మకాలు 25,647గా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో డిజైర్‌ విక్రయాలు 14,703 కాగా, అప్పట్లో అయిదో బెస్ట్‌ సెల్లింగ్‌ మోడల్‌గా నిల్చింది.

మరోవైపు, గత జూలైలో 26,009 విక్రయాలతో నంబర్‌వన్‌ స్థానంలో నిల్చిన ఆల్టో అమ్మకాలు తాజాగా 23,371కు తగ్గడంతో రెండో స్థానానికి పరిమితమైంది. ఇక మారుతీకే చెందిన స్విఫ్ట్‌ మూడో బెస్ట్‌ సెల్లింగ్‌ మోడల్‌గా నిల్చింది. విక్రయాలు 13,738 యూనిట్ల నుంచి 19,993 యూనిట్లకు పెరిగాయి. అటు 17,960 యూనిట్లతో బాలెనో నాలుగో స్థానంలో, వాగన్‌ఆర్‌ అయిదో స్థానంలో (14,339 వాహనాలు), ఎస్‌యూవీ విటారా బ్రెజా ఆరో స్థానంలో (14,181 యూనిట్లు) ఉన్నాయి.

ఇక హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా  మూడు మోడల్స్‌తో రెండో స్థానంలో ఉంది. ఎలీట్‌ఐ20 మోడల్‌ (10,822 యూనిట్లు), గ్రాండ్‌ఐ10 (10,775 యూనిట్లు), ఎస్‌యూవీ క్రెటా (10,423 కార్లు) వరుసగా 7,8,9 స్థానాల్లో ఉన్నాయి. కొత్త కాంపాక్ట్‌ సెడాన్‌ కారు అమేజ్‌తో హోండా కార్స్‌ ఇండియా తొలిసారిగా టాప్‌ 10 జాబితాలో చోటు దక్కించుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top