మార్కెట్ల హైజంప్‌- 3 నెలల గరిష్టం

Market jumps to 3 month high - Sakshi

సెన్సెక్స్‌ 519 పాయింట్లు ప్లస్‌

160 పాయింట్లు ఎగసిన నిఫ్టీ

35,430 వద్ద సెన్సెక్స్‌ ముగింపు

10,471 వద్ద నిలిచిన నిఫ్టీ

ఇంట్రాడే గరిష్టానికి చేరువలోనే

లాక్‌డవున్‌ల ఎత్తివేతతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల రికవరీపై ఆశలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ స్టాక్‌ మార్కెట్లు బలపడుతున్నాయి. వెరసి వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు దూకుడు చూపాయి. సెన్సెక్స్‌ 519 పాయింట్లు జంప్‌చేసి 35,430 వద్ద నిలవగా.. 160 పాయింట్లు జమ చేసుకున్న నిఫ్టీ 10,471 వద్ద స్థిరపడింది. ఇది మూడు నెలల గరిష్టంకాగా.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సమయం గడిచేకొద్దీ మార్కెట్లు బలపడుతూ వచ్చాయి. ఫలితంగా ఇంట్రాడే గరిష్టాలకు చేరువలోనే ముగిశాయి. తొలుత 34,844 దిగువన కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్‌ చివర్లో 35,482ను అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ 10,485- 10,302 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. 

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ పుంజుకోగా.. రియల్టీ, బ్యాంక్‌ నిఫ్టీ, మీడియా, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా 3-1.5 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌, ఎన్‌టీపీసీ, హిందాల్కో, యూపీఎల్‌, పవర్‌గ్రిడ్‌, శ్రీ సిమెంట్‌, యాక్సిస్‌, ఇన్‌ఫ్రాటెల్‌ 9.3-3.3 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో కేవలం ఆర్‌ఐఎల్‌ 1.4 శాతం, ఎయిర్‌టెల్‌ 0.6 శాతం మాత్రమే నీరసించాయి.

బంధన్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో బంధన్‌ బ్యాంక్‌ 15 శాతం దూసుకెళ్లగా.. జస్ట్‌ డయల్‌, నౌకరీ, డీఎల్‌ఎఫ్‌, పిరమల్‌ 7-5 శాతం మధ్య పురోగమించాయి. కాగా.. గ్లెన్‌మార్క్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, మణప్పురం, సెంచురీ టెక్స్‌, మెక్‌డోవెల్‌, ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, పేజ్‌ 7-1 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.7 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1964 లాభపడగా.. 761 మాత్రమే డీలాపడ్డాయి.

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 424 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,288 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1,237 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 881 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top