
రూ.800 కోట్లతో ‘కిమ్స్’ విస్తరణ..
వైద్య సేవల రంగంలో ఉన్న కిమ్స్ హాస్పిటల్స్ విస్తరణ బాటలో ఉంది. రానున్న మూడేళ్లలో రూ.800 కోట్లతో పడకల సామర్థ్యాన్ని పెంచుతోంది.
♦ రెండు నెలల్లో రాజమండ్రి ఆసుపత్రి సేవలు
♦ కిమ్స్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ బొల్లినేని
హైదరాబాద్: వైద్య సేవల రంగంలో ఉన్న కిమ్స్ హాస్పిటల్స్ విస్తరణ బాటలో ఉంది. రానున్న మూడేళ్లలో రూ.800 కోట్లతో పడకల సామర్థ్యాన్ని పెంచుతోంది. గువహటి, భువనేశ్వర్, ఇండోర్, బెంగళూరు నగరాల్లోనూ ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించి... ఇందుకు స్థలాలను కూడా ఎంపిక చేసినట్లు సంస్థ స్ట్రాటజీ, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అభినయ్ బొల్లినేని తెలియజేశారు. గురువారం ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ... ఈ నగరాల్లో మొత్తం 1,100 పడకల సామర్థ్యంతో హాస్పిటల్స్ రానున్నట్లు చెప్పారాయన.
ప్రస్తుతం సంస్థకు సికింద్రాబాద్, కొండాపూర్, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళంలో ఆసుపత్రులున్నాయి. వీటి సామర్థ్యం 1,800 పడకలు. తెలుగు రాష్ట్రాల్లో మరో 1,000 పడకలను జత చేయనున్నారు. రాజమండ్రిలో 350 పడకలున్న ఒక ఆసుపత్రిని సంస్థ కొనుగోలు చేస్తోంది. రెండు నెలల్లో ఇది అందుబాటులోకి రానుంది. దిల్సుఖ్నగర్లో 250 పడకలతో సెంటర్ను నెలకొల్పుతోంది. నెల్లూరు, కొండాపూర్, శ్రీకాకుళం కేంద్రాల సామర్థ్యాన్ని పెంచుతోంది. విస్తరణకు కావాల్సిన నిధుల్లో రూ.300 కోట్లు అంతర్గతంగా, రూ.500 కోట్లను రుణం రూపంలో సమకూర్చనుంది.