
సాక్షి, న్యూఢిల్లీ : 48 మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్లకు అప్గ్రేడ్ చేస్తూ...రైల్వే తీసుకున్న నిర్ణయంతో ఇక వాటి ఛార్జీలు కూడా పెరుగబోతున్నాయి. పెంచిన స్పీడుకు అనుగుణంగా సూపర్ఫాస్ట్ లెవీలు విధించాలని రైల్వే ప్లాన్ చేస్తోంది. నవంబర్ 1న రైల్వే విడుదల చేసిన కొత్త టైమ్ టేబుల్లో ఈ రైళ్ల సగటు స్పీడును గంటకు 5 కిలోమీటర్లను పెంచింది. ఈ రైళ్ల వేగాన్ని పెంచినప్పటికీ, ఇవి సరియైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకుంటాయా? అన్నది ప్రశ్నార్థకమే. అంతేకాక వచ్చేది శీతాకాలం కావడంతో, పొగమంచు కారణంతో చాలా రైళ్లు గంటల పాటు ఆలస్యమయ్యే అవకాశముంది. అయినప్పటికీ రైల్వే మాత్రం వీటిపై ఛార్జీలకు సిద్ధమైంది. ప్రస్తుతమైతే రాజధాని, దురంతో, శతాబ్ది వంటి ప్రీమియం సేవలందించే అనేక రైళ్లు చాలా ఆలస్యంగా తమ గమ్యస్థానాలను చేరుకుంటూ ఉంటున్నాయి.
ఈ ఛార్జీల విధింపుతో స్లీపర్కు అదనంగా రూ.30 కంటే ఎక్కువ, సెకండ్, థర్డ్ ఏసీలకు రూ.40, ఫస్ట్ ఏసీ క్లాస్కు రూ.75ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రైల్వే అదనంగా రూ.70 కోట్లను సమీకరించనుంది. అదనంగా 48 రైళ్లను సూపర్ ఫాస్ట్ కేటగిరిలోకి అప్గ్రేడ్ చేయడంతో, మొత్తం 1,072 రైళ్లు సూపర్ ఫాస్ట్ కేటగిరీ కిందకి వచ్చాయి. అయితే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా జూలైలో తీసిన రిపోర్టులో ప్రయాణికులు సూపర్ ఫాస్ట్ ఛార్జీలను చెల్లిస్తున్నా... రైళ్లు మాత్రం వేగంగా నడవడం లేదని తేల్చింది. అంతేకాక సూపర్ ఫాస్ట్ సర్వీసులను అందించలేని పక్షంలో ప్రయాణికులు చెల్లించిన సూపర్ ఫాస్ట్ లెవీలను వారికి తిరిగి రీఫండ్ చేసేలా నిబంధనలను రూపొందించాలని కూడా ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు అలాంటి నిబంధనలనేమీ రైల్వే బోర్డు రూపొందించలేదు.