వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి | Sakshi
Sakshi News home page

వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి

Published Mon, Mar 12 2018 12:25 AM

FICCI, Assocham on pnb scam - Sakshi

ముంబై: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) స్కామ్‌ ఆర్థిక వ్యవస్థలో భయాందోళనకు, అచేతనానికి దారితీయరాదని ఫిక్కీ సూచించింది. ఈ విధమైన పరిస్థితి ఏర్పడకుండా చూడాలని ఆర్‌బీఐ, ప్రభుత్వాలకు లేఖ రాసినట్టు ఫిక్కీ ప్రెసిడెంట్‌ రషేష్‌ షా తెలిపారు. షా ఎడెల్వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు.

పీఎన్‌బీ స్కామ్‌ యూపీఏ–2 హయాంలోని చివరి రోజులను గుర్తు చేస్తోందని, నాడు సీబీఐ, సీవీసీ, కాగ్‌ అంటే భయం ఉండేదని షా పేర్కొన్నారు. ఈ తరహా స్కామ్‌ల తో బ్యాంకింగ్‌ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్న ఆయన, 1992లో హర్షద్‌ మెహతా స్కామ్, 2001లో కేతన్‌ పరేఖ్‌ స్కామ్‌ల తర్వాత పరిస్థితిని గుర్తు చేశారు. పీఎన్‌బీ స్కామ్‌ను వ్యవస్థల బలోపేతా నికి అవకాశంగా సూచించారు.  

రుణాలపై ప్రభావం పడరాదు
పీఎన్‌బీ స్కామ్‌తో దర్యాప్తు సంస్థలు, బ్యాంకులు అతిగా స్పందించడం వల్ల వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు రుణాల జారీపై ప్రభావం పడుతుందని అసోచామ్‌ హెచ్చరించింది. బ్యాంకులు, నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ చర్యలు నష్టాన్ని పరిమితం చేసే విధంగా ఉండాలని సూచించింది.

‘‘కుంభకోణాలు బయటకు వచ్చాక, మీడియాలో ప్రముఖంగా వార్తలు రావడంతో ఈ స్థాయి హడావిడి సాధారణమే. కానీ, ఇది బ్యాంకుల విశ్వాసానికి విఘాతం కలిగిస్తుంది. కనుక ఎంతో నిగ్రహంతో ఈ సందర్భాన్ని ఓ అవకాశంగా భావించి వ్యవస్థాపరమైన సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాలి’’ అని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ డీఎస్‌ రావత్‌ సూచించారు.  

Advertisement
Advertisement