
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టాలకు– సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, కాంపన్షేన్ ఆఫ్ స్టేట్స్ యాక్స్కు దాదాపు 46 సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రతిపాదిత సవరణలకు పార్లమెంటు ఆమోదం పొందితే ఉద్యోగులకు ఆహారం, రవాణా, బీమా వంటి సదుపాయాల కల్పనకు సంబంధించి యాజమాన్యాలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని పొందగలుగుతారు.
రివర్స్ చార్జ్ యంత్రాంగంలో మార్పులు, వివిధ వ్యాపార కార్యకలాపాలు ఉన్న కంపెనీలకు ప్రత్యేక రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ రద్దు, రిటర్న్ ఫైలింగ్లో నూతన నిబంధనలు, బహుళ ఇన్వాయిస్లను కలిపి కన్సాలిడేటెడ్ డెబిట్/క్రెడిట్ నోట్లు వంటి పలు అంశాలు జీఎస్టీ సవరణల ప్రతిపాదన కింద ఉన్నాయి. వీటికి కేంద్రం ముసాయిదా ప్రతిపాదనలను విడుదల చేసింది.
ఈ ఏడాది జూలై 15వ తేదీలోపు దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని సంబంధిత వర్గాలను కోరింది. ఈ సవరణలకు రెవెన్యూ శాఖ ఆమోదముద్ర పడితే, తదుపరి అనుమతికి జీఎస్టీ మండలికి వెళతాయి. తర్వాత సవరణలకు ఆమోదం నిమిత్తం పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీల ముందు ప్రవేశపెడతారు.