రుణ ప్రణాళికకు బ్యాంకర్లు ఓకే

Bankers Ok For Solution plan to Reliance Innfra - Sakshi

రిలయన్స్‌ ఇన్‌ఫ్రా వెల్లడి

ముంబై: దాదాపు రూ. 7,500 కోట్ల రుణాల పరిష్కార ప్రణాళికకు రుణదాతలు ఆమోదం తెలిపినట్లు అనిల్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇన్‌ఫ్రా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఇంటర్‌–క్రెడిటార్‌ ఒప్పందం (ఐసీఏ)పై రుణాలిచ్చిన మొత్తం 16 సంస్థలు సంతకాలు చేసినట్లు పేర్కొంది. ఆర్‌బీఐ కొత్త సర్క్యులర్‌ ప్రకారం రుణగ్రహీత ఏ ఒక్క బ్యాంకుకైనా డిఫాల్ట్‌ అయిన పక్షంలో 30 రోజుల్లోగా మిగతా రుణదాతలు సదరు ఖాతాను సమీక్షించాల్సి ఉంటుంది.

ఈ సమయంలో బ్యాంకులు నిర్దిష్ట పరిష్కార ప్రణాళికను నిర్ణయించి, ఐసీఏ కుదుర్చుకోవాలి. రుణ విలువలో దాదాపు 75 శాతం ఇచ్చిన రుణదాతలు, సంఖ్యాపరంగా 60 శాతం మంది రుణదాతలు .. పరిష్కార ప్రణాళికపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. కన్సార్షియంలో మిగతా రుణదాతలు కూడా ఈ పరిష్కార ప్రణాళికకు కట్టుబడాల్సి ఉంటుంది. వివిధ అసెట్స్‌ను విక్రయించడం, లీజుకివ్వడం తదితర మార్గాల్లో నిధుల సమీకరణ ద్వారా నిర్దేశిత 180 రోజుల డెడ్‌లైన్‌ లోగానే పరిష్కార ప్రణాళికను అమలు చేయగలమని రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ధీమా వ్యక్తం చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top