5 శాతం వృద్ధి కోసం కష్టించాల్సిందే...
భారత జీడీపీపై అమెరికా ఆర్థికవేత్త హంకే
న్యూఢిల్లీ: భారత్ 2020లో 5 శాతం వృద్ధి రేటు కోసం కష్టపడాల్సి ఉంటుందన్నారు అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త స్టీవ్ హంకే. ‘‘గత కొన్ని త్రైమాసికాల్లో వృద్ధి రేటు గణనీయంగా తగ్గిపోవడం అన్నది రుణాల లభ్యత నిలిచిపోవడం వల్లే. ఇది సైక్లికల్ సమస్యే కానీ, నిర్మాణపరమైనది కాదు. ఈ పరిస్థితుల్లో 2020లో 5 శాతం జీడీపీ వృద్ధిని సాధించాలంటే కష్టపడాల్సి ఉంటుంది’’ అంటూ జాన్ హప్కిన్స్ యూనివర్సిటీలో అప్లయిడ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న హంకే పేర్కొన్నారు. భారత్ నిలకడలేని రుణాల బూమ్ను చవిచూసిందని, భారీగా పెరిగిపోయిన ఎన్పీఏ సమస్య నుంచి బయటపడేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. భారత్ ఎంతో రక్షణాత్మకంగా వ్యవహరించే దేశమని గుర్తు చేశారు. అవసరమైన గట్టి సంస్కరణలను చేపట్టే విషయంలో మోదీ సర్కారుకు ఆసక్తి తక్కువగా ఉన్నట్టు కనిపిస్తోందని హంకే అభిప్రాయపడ్డారు.