ఎయిర్‌ ట్రాఫిక్‌.. అయిదున్నర రెట్లకు | Airbus estimates on India | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ట్రాఫిక్‌.. అయిదున్నర రెట్లకు

Mar 10 2018 1:25 AM | Updated on Mar 10 2018 8:23 AM

Airbus estimates on India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా పది మందిలో ఒకరు విమాన ప్రయాణం చేస్తున్నారు. ఈ సంఖ్య 20 ఏళ్లలో నాలుగుకు చేరుకుంటుందని ఎయిర్‌బస్‌ అంచనా వేస్తోంది. భారత్‌లో ఎయిర్‌ ట్రాఫిక్‌ అయిదున్నర రెట్లకు చేరుకుంటుందని ఎయిర్‌బస్‌ ఆసియా మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జూస్‌ వాన్‌ డీ హేజ్డెన్‌ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు.

‘ప్రయాణికుల వృద్ధి రేటు ప్రపంచ సగటు 4.4% నమోదు కానుంది. భారత్‌ మాత్రం దాదాపు రెండింతలతో 8.1% ఉండనుంది. దేశీయ ప్రయాణికుల వృద్ధి రేటు 8.9 శాతంగా నమోదు చేస్తుంది. కొత్తగా 1,750 విమానాలు అవసరం అవుతాయి. వచ్చే 10 సంవత్సరాల్లో ప్రతి వారం ఒక ఎయిర్‌బస్‌ విమానం భారత్‌లో అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఇక్కడ 300 లకుపైగా ఎయిర్‌బస్‌ విమానాలు ఎగురుతున్నాయి’ అని వివరించారు.

మేకిన్‌ ఇండియాకు కట్టుబడ్డాం..: భారత్‌ నుంచి విడిభాగాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నట్టు ఎయిర్‌బస్‌ ఇండియా కమర్షియల్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాసన్‌ ద్వారకానాథ్‌ తెలిపారు. ‘మేకిన్‌ ఇండియాకు కట్టుబడి ఉన్నాం. మూడేళ్లలో రూ.9,750 కోట్ల విలువైన విడిభాగాలను భారత్‌ నుంచి కొనుగోలు చేశాం.

10 ఏళ్లలో కొనుగోళ్లు 16 రెట్లకు చేరుకున్నాయి. 6,000 మందికి ఉపాధి కల్పించగలిగాం. ఎయిర్‌బస్‌ పూర్తి స్థాయి శిక్షణ కేం ద్రం ఆసియాలో మొదటిసారిగా ఢిల్లీలో నెలకొల్పుతున్నాం’ అని తెలిపారు. హైదరాబాద్‌ స్టార్టప్స్‌తో చేతులు కలుపబోతున్నారా అన్న ప్రశ్నకు టి–హబ్‌తో కలిసి పనిచేయబోతున్నామని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement