ఈ నెల 5 వరకూ కార్యకలాపాలు బంద్‌

ఈ నెల 5 వరకూ  కార్యకలాపాలు బంద్‌


 ఎయిర్‌ కోస్టా వెల్లడి

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్‌ కోస్టా తన కార్యకలాపాలను ఈ నెల 5 వరకూ సస్పెండ్‌ చేసింది. నిధుల సమీకరణలో సమస్యలు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఎయిర్‌ కోస్టా వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌) కవి చౌరాసియా చెప్పారు. రెండు రోజుల పాటు కార్యకలాపాలను నిర్వహించలేమని మంగళవారం ఈ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే.  నిధుల సమీకరణ విషయమై ఆసక్తిగా ఉన్న ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నామని, ఈ లావాదేవీ ఖరారు కావడానికి మరికొంత సమయం పడుతుందని కవి చౌరాసియా వివరించారు.


ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కార్యకలాపాలను మరికొన్ని రోజులు నిలిపేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. చాలా మంది ఉద్యోగులకు  జనవరి నెల వేతనాలు కూడా చెల్లించలేదని సమాచారం. ఈ సంస్థ రోజుకు ఎనిమిది నగరాలకు 16 విమాన సర్వీసులను నిర్వహించేది. ఈ కంపెనీకి రెండు లీజ్‌డ్‌ విమానాలున్నాయి. మొత్తం 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో విమాన సర్వీసులను నిలిపేసిన రెండో కంపెనీ ఇది. ఇంతకు ముందు ఎయిర్‌ పెగాసస్‌ ఇలాగే విమాన సర్వీసులను ఆపేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top