పన్ను వసూళ్లు... 31% క్షీణత

Advance tax collection in June quarter dips 31 per cent - Sakshi

ముందస్తు పన్ను రాబడి ఏకంగా 76% పతనం

ముంబై:  పన్ను వసూళ్లపై కరోనా ప్రభావం తీవ్రంగా కనిపించింది. జూన్‌ 15 వరకూ విడుదలైన అధికారిక ప్రకటన ప్రకారం స్థూల పన్ను వసూళ్లు (–) 31 శాతం క్షీణించాయి. రూ.1,37,825 కోట్లుగా నమోదయ్యాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం జూన్‌ 15 వరకూ చూస్తే, ఈ మొత్తం రూ.1,99,755 కోట్లు.  పన్ను వసూళ్లు ఇంతలా క్షీణతను నమోదుచేసుకోవడానికి ముందస్తు పన్ను వసూళ్లు 76 శాతం క్షీణతను నమోదుచేసుకోవడం ప్రధాన కారణమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

► రిఫండ్స్‌ పోను మిగిలిన నికర పన్ను వసూళ్ల మొత్తం 32 శాతం క్షీణతతో రూ.1,36,941 కోట్ల నుంచి రూ.92,681 కోట్లకు తగ్గింది. రిఫండ్స్‌ పరిమాణం రూ.45,143 కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో (రూ.62,813 కోట్లు) పోల్చిచూస్తే, 28 శాతం తగ్గాయి.  

► 2019–20 ఆర్థిక సంవత్సరం జూన్‌ 15 వరకూ చూస్తే, ముందస్తు పన్ను వసూళ్లు రూ.48,917 కోట్లుగా ఉంటే, ఈ ఏడాది ఇదే కాలానికి ఈ మొత్తం 76.5 శాతం పతనంతో రూ.11,714 కోట్లకు పడిపోయింది.  

► ఒక్క ముందస్తు కార్పొరేట్‌ పన్ను వసూళ్లు 79 పడిపోయి, రూ.39,405 కోట్ల నుంచి రూ.8,286 కోట్లకు పడిపోయింది. ఇందుకు సంబంధించి వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 64% క్షీణతతో రూ.9,512 కోట్ల నుంచి రూ.3,428 కోట్లకు తగ్గాయి.  

► అడ్వాన్స్‌ పన్ను చెల్లింపులకు తుది గడువు జూన్‌ 15. అడ్వాన్స్‌ పన్ను చెల్లింపుల పరిధిలోనికి వచ్చే అసెస్సీలు, వారు చెల్లించాల్సిన మొత్తంలో 15 శాతాన్ని మొదటి త్రైమాసికంలో చెల్లించాలి. 25 శాతం చొప్పున తదుపరి రెండు త్రైమాసికాల్లో చెల్లించాలి. 35 శాతాన్ని నాల్గవ త్రైమాసికంలో చెల్లించాలి.  

► 2020–21 ఆర్థిక సంవత్సరం స్థూల పన్ను వసూళ్ల లక్ష్యం రూ.24.23 లక్షల కోట్లు. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చిచూస్తే (రూ.21.63 లక్షల కోట్లు) ఈ పరిమాణం 12% అధికం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top