అధికారంలోకి వచ్చాక రోజాకి కీలక పదవి : విజయసాయి రెడ్డి
సాక్షి, తిరుపతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి మానసిన స్థితి బాగోలేదని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. మానసిక పరిస్థితి బాగోలేని వ్యక్తి సీఎంగా కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లా నగిరిలో వైఎస్సార్సీపీ శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబును నరకాసురుడిగా వర్ణించారు. వచ్చే ఎన్నికల తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే రోజాకు కీలక పదవి లభిస్తుందని ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సమస్యలపై రోజా అలుపెరగని పోరాటం చేస్తున్నారని.. ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా తన సొంత డబ్బుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు.
వైఎస్సార్సీపీ సమీక్షా సమావేశం
సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. శనివారం తుమ్మలగుంటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గ సమన్వయకర్తలు, నగర అనుబంధ విభాగాల అధ్యక్షుల సమీక్షా సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ సంస్థాగత నిర్మాణాలవ్యవహారాల ఇన్చార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తారు. తొలుత పార్లమెంట్, జిల్లా, నగర పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమీక్ష నిర్వహిస్తారు. ఎన్నికల కార్యాచరణ, పార్టీ సంస్థాగత నిర్మాణం, కూర్పు, తదితర అంశాలపై చర్చించనున్నారు. అనంతరం పార్లమెంట్ జిల్లా, నగర అనుబంధ విభాగాల అధ్యక్షులతో విడివిడిగా సమావేశం నిర్వహిస్తారు. వీరికి ఆయన దిశానిర్దేశం చేస్తారు.