దీక్షాదక్షత! | Sakshi
Sakshi News home page

దీక్షాదక్షత!

Published Sun, Apr 8 2018 8:46 AM

YSRCP MPs on indefinite fast over special category status for AP - Sakshi

అనంతపురం: ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేపట్టడంతో ఉద్యమం తీవ్రతరమైంది. తొలిరోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ఆందోళనలు, నిరసనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించగా.. రెండోరోజు శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రిలే దీక్షలు చేపట్టారు. ఎంపీల త్యాగానికి పాదాభివందనం చేస్తూ వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు అనంతపురంలో వారి ఫొటోలకు పాలాభిషేకం చేశారు. 

 తాడిపత్రిలో పైలా నరసింహయ్య, ఎస్కేయూలో వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకుడు భానుప్రకాష్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. 

 అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నియోజకవర్గ సమన్వయకర్త నదీమ్‌అహ్మద్‌ ఆధ్వర్యంలో రిలేదీక్షలు ప్రారంభమయ్యాయి. నదీమ్‌ మాట్లాడుతూ హోదాను తక్కువ చేసి ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపిన సీఎం రాష్ట్ర ప్రజల హక్కును కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారన్నారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్న టీడీపీకి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరుశురాం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవీ శివారెడ్డి పాల్గొన్నారు. 

 పెనుకొండ ఆర్డీఓ కార్యాలయం వద్ద హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు శంకరనారాయణ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు పదవులకు రాజీనామాలు చేయడం రాష్ట్ర  చరిత్రలో ఓ మహాధ్యాయమన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే టీడీపీ తాజాగా హోదా డ్రామాకు తెరతీసిందన్నారు.

 ధర్మవరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షల్లో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన వారిపై సీఎం చంద్రబాబు అక్రమ కేసులు పెట్టించారన్నారు. హోదా వద్దు, ప్యాకేజీ అంటూ డ్రామాలు ఆడి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు.  

 రాయదుర్గం పట్టణం లక్ష్మీబజార్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం పక్కన మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. ముందుగా వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాపు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అడుగడుగునా అడ్డుకున్న నీచ చరిత్ర చంద్రబాబుదేనన్నారు.

మడకశిర పట్టణం వైఎస్‌ విగ్రహం వద్ద సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ముందుగా వైఎస్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

 తాడిపత్రిలో సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో మాజీ జిల్లా కన్వీనర్‌ పైలా నరసింహయ్య ఆమరణదీక్ష చేపట్టారు. ముందుగా  మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి మట్లాడుతూ  ఉద్యమమే ఊపిరిగా ముందుకు సాగుతున్న వైఎస్సార్సీపీని సీఎం చంద్రబాబు నాలుగేళ్లుగా అణగదొక్కాలని చూస్తున్నారన్నారు.

 హిందూపురంలో సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. చిన్న మార్కెట్‌ వద్ద నుంచి సద్భావన సర్కిల్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. అక్కడే రిలే దీక్షలు చేపట్టారు.

 శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 గుంతకల్లు పట్టణంతో పాటు, పామిడిలో రిలే దీక్షలు చేపట్టారు. గుంతకల్లు దీక్షలో సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి, మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఫ్లయింగ్‌ మాబు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి జింకల రామాంజనేయులు పాల్గొన్నారు.

 కదిరి పట్టణంలో సమన్వయకర్త డాక్టర్‌ సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు.

► కళ్యాణదుర్గం రెవెన్యూ కార్యాలయం ఎదుట సమన్వయకర్త ఉషశ్రీచరణ్‌ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. జీఎస్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పేస్వామినాయక్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాజునాయక్, ఎమ్మార్పీఎస్‌ నాయకులు విజయ్, ఎస్‌ఎఫ్‌ఐ అచ్యుత్‌ప్రసాద్‌ సంఘీభావం తెలిపారు. 

► రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయం వద్ద జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రరెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ బోయ రామాంజనేయులు, యువజన విభాగం కన్వీనర్‌ చిట్రెడ్డి సత్యనారాయణ తదితరులు రిలే దీక్షలో కూర్చున్నారు. సాయంత్రం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
 
 పుట్టపర్తి పట్టణం సత్యమ్మ దేవాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. పార్టీ జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

► ఉరవకొండ పట్టణం టవర్‌క్లాక్‌ వద్ద రిలే దీక్షలు చేపట్టారు. పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, జెడ్పీటీసీ తిప్పయ్య, రాష్ట్ర ప్రచారకార్యదర్శి తిరుపాల్‌శెట్టి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement