టీడీపీ ఆగడాలు | ysrcp leader thamineni | Sakshi
Sakshi News home page

టీడీపీ ఆగడాలు

Jul 2 2014 5:34 AM | Updated on Aug 21 2018 5:46 PM

టీడీపీ ఆగడాలు - Sakshi

టీడీపీ ఆగడాలు

విశాఖలో తమ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలపై సమీక్షిస్తుండగా టీడీపీ కార్యకర్తలు వచ్చి రౌడీల్లా ప్రవర్తించారని వైఎస్సార్‌సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం ఆరోపించారు.

 - రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు
 - పోలీసులు సై అంటున్నారు
 - పరిషత్ పీఠాల కోసం అడ్డదారులు
 - బాబు దిగజారుడు రాజకీయాలు
 - వైఎస్సార్‌సీపీ నేత తమ్మినేని ధ్వజం

విశాఖపట్నం : విశాఖలో తమ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలపై సమీక్షిస్తుండగా టీడీపీ కార్యకర్తలు వచ్చి రౌడీల్లా ప్రవర్తించారని వైఎస్సార్‌సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం ఆరోపించారు. నగరంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ కార్యకర్తల తీరు హేయమైనదిగా సీతారాం అభివర్ణించారు. నియంత్రించాల్సిన పోలీసులు అధికార పార్టీ వారి అడుగులకు మడుగులొత్తుతున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులపట్ల వారు దారుణంగా ప్రవర్తించారని ఆరోపించారు.

ఫ్యాన్ గుర్తుపై గెలుపొందిన వారు పార్టీ ఫిరాయిస్తే సభ్యత్వం రద్దు చేయడంతో పాటు అనర్హత వేటు పడుతుందని సీతారాం హెచ్చరించారు. పార్టీ విప్ జారీ చేసిన సంగతిని గుర్తు చేశారు. పార్టీ గుర్తింపుపై సంబంధిత ఉత్తర్వులు జిల్లా కలెక్టర్లందరికీ అందాయన్నారు.  పరిషత్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను టీడీపీ ప్రలోభాలకు గురిచేస్తోందన్నారు. ఫ్యాన్ గుర్తుపై గెలుపొందిన వారెవరైనా పార్టీ మారితే అనర్హత వేటు వేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ మెజార్టీ సాధించిన స్థానాల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు టీడీపీకి రావాలని చంద్రబాబు ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆదేశాలు ఇస్తున్నారని ఆరోపిం చారు.

రౌడీయిజం చేసైనా అన్ని పదవులూ కైవసం చేసుకోవాలని నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు స్వయంగా ఫోన్ చేసి పార్టీలో చేరాలని ప్రలోభపెట్టడం దిగజారుడుతనమని ఆక్షేపించారు. చంద్రబాబులా అసత్య ప్రచారా లు చేసుంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. రైతు రుణమాఫీ సాధ్యం కాదని తెలిసిన చంద్రబాబు రుణమాఫీ చేస్తామని అబద్ధాలాడారన్నారు.

ఇప్పు డు రుణమాఫీ చేయడానికి కేంద్రం, రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా  సహకరించడం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, బూడి ముత్యాలనాయుడు, గిడ్డి ఈశ్వరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్, నాయకులు గుడివాడ అమర్,  చెంగల వెంకట్రావు, గండి బాబ్జి, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, కర్రి సీతారాం, నాయకుడు కోరాడ రాజబాబు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement