జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ద్వారకనాథరెడ్డి మండిపడ్డారు
► మంత్రి దేవినేనికి ప్రకటనపై కట్టుబడే ధైర్యం ఉందా ?
► వైఎస్సార్సీపీ తంబళ్లపల్లె సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి
బి.కొత్తకోట: హంద్రీ–నీవా కాలువల ద్వారా జిల్లాకు కృష్ణా నీరు అందించేందుకు జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇంకెన్ని ఆగస్టులు కావాలని వైఎస్సార్సీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రశ్నించారు. రానున్న ఆగస్టులో నీటిని రప్పిస్తామని మంత్రి బుధవా రం రాత్రి బి.కొత్తకోట మండల పర్యటన సందర్భంగా చేసిన ప్రకటనపై తీవ్రంగా స్పందించారు.
గురువారం నంద్యాల నుంచి ఆయన ఫోన్లో స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ ఆగస్టుకు నీరిస్తామన్న ప్రకటనకు కట్టుబడే ధైర్యం మంత్రికి ఉందా ? అని ప్రశ్నించారు. సీఎం, మంత్రి నోటివెంట ఎన్ని ఆగస్టులు, ఎన్ని మార్చి లు, ఎన్ని డిసెంబర్లు గడచిపోయాయో ప్రజలకు తెలుసన్నా రు. జిల్లాలో ఇంకా రూ.900 కోట్లకుపైబడిన పనులు పెండింగ్లో ఉన్నాయని, అందులో బి.కొత్తకోట శివారులో నిర్మిస్తున్న బ్రిడ్జి ఉందని, ఆగస్టుకు ఈ ఒక బ్రిడ్జి పూర్తిచేయించే సామర్థ్యం ఉందా ? ఉంటే సవాలు స్వీకరించాలని మంత్రిని డిమాండ్ చేశారు. రైతులకు పంటనష్ట పరిహారం ఇప్పించేందుకు మంత్రి దృష్టిపెట్టాలని కోరారు.