ఇడుపులపాయలో ఘనంగా వైఎస్సార్ జయంతి
సాక్షి, వేంపల్లె / పులివెందుల : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి కార్యక్రమం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి వైఎస్ షర్మిల, ఈసీ గంగిరెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు శనివారమే ఇడుపులపాయకు చేరుకున్నారు. ఆదివారం ఉదయాన్నే వైఎస్సార్ ఘాట్కు చేరుకున్న కుటుంబసభ్యులు, వైఎస్సార్ సన్నిహితులు ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అంజాద్ బాషా, పార్టీ నేతలు సురేష్ బాబు, అమర్నాథ్ రెడ్డి, రాఘవరెడ్డి, తదితరులు పాల్గొని వైఎస్సార్కు నివాళులు అర్పించారు.
ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారు : అనంతరం వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ప్రజలు రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా, వైఎస్ జగన్ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారని, ప్రజల మద్దతు ఆయనకు ఉందని చెప్పారు. అనంతరం ఆమె రచించిన 'అనుదిన జ్ఞానావళి' పుస్తకాన్ని ఆవిష్కరించారు.