వైఎస్సార్ జిల్లా పేరు కూడా ఉచ్చరించరా? | YSR district, the pronunciation of the name? | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ జిల్లా పేరు కూడా ఉచ్చరించరా?

Mar 8 2015 3:22 AM | Updated on Sep 4 2018 5:16 PM

గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కనీసం వైఎస్సార్ జిల్లా పేరును ఉచ్చరించడానికి సైతం సిద్ధపడక పోవడం చంద్రబాబునాయుడు

సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కనీసం వైఎస్సార్ జిల్లా పేరును ఉచ్చరించడానికి సైతం సిద్ధపడక పోవడం  చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
  గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన సహచర ఎమ్మెల్యేలు తిరువీధి జయరాములు, షేక్ బేపారి అంజాద్‌బాషాతో కలిసి మాట్లాడుతూ ‘రాయలసీమలో కరువు ఉందంటూనే చిత్తూరు, అనంతపురం జిల్లాలో 1200 అడుగుల లోతుకు వెళ్లినా బోర్లకు నీరందడం లేదని గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం పొందుపర్చింది. మరి వైఎస్సార్ జిల్లాలో 1600 అడుగులు తవ్వినా నీరందడం లేదన్నది ఎందుకు విస్మరించారు’ అని ఆయన ప్రశ్నించారు. ‘మా జిల్లాలో 50 మండలాలకు గాను 48 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వమే ప్రకటించింది. అక్కడ మామిడి, చీనీ తోటలు నీళ్లు లేక ఎండిపోయాయి. పంటలు కూడా వేసుకోలేని పరిస్థితి నెలకొని ఉంది.
 
  రాయలసీమ, ఉత్తరాంధ్రలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని అంటూ వైఎస్సార్ జిల్లా పేరును కూడా ఉచ్చరించక పోవడం దారుణం. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇలా మనుషులపైప్రాంతాల వారీగా, పార్టీల వారీగా వివక్ష చూపించడం తగదు’ అని ధ్వజమెత్తారు. టీడీపీ కరపత్రంలాగా రూపొందించిన గవర్నర్ ప్రసంగంలో తమ జిల్లా ఊసే ఎత్తక పోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లా ప్రజలు ఏపీలో అంతర్భాగం కాదా...ఎందుకింత వివక్షను చూపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వారు అన్ని ప్రాంతాలను ప్రజలను సమాన దృష్టితో చూడాలని హితవు పలికారు. తమ జిల్లాకు అన్యాయం చేస్తే తాము చూస్తూ ఊరుకోమని ప్రజలు కూడా సహించరని గడికోట హెచ్చరించారు. తమ జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్‌ను ఏర్పాటు చేస్తామని చట్టంలోనే పెట్టారు. మళ్లీ రెండు జిల్లాల్లో ఎక్కడో ఒక చోట పెడతామని ప్రాంతీయ విభేదాలు తలెత్తేలా చేస్తున్నారని ఆయన విమర్శించారు.

 కర్నూలులో కూడా ఇలాంటి ప్రాజెక్టునే నిర్మిస్తామని చెప్పారని అందుకు తాము వ్యతిరేకం కాదని తమ జిల్లాలో మాత్రం చెప్పిన విధంగా సెయిల్ ద్వారానో, ప్రభుత్వ రంగంలోనో ఉక్కు కర్మాగారం నిర్మించాలని డిమాండ్ చేశారు. తమ జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీని నెలకొల్పుతామన్న చంద్రబాబు ఇతర జిల్లాల్లో పర్యటించేటప్పుడు అక్కడ కూడా పెడతామని నాలుగు చోట్ల వాగ్దానం చేశారని ఇదెక్కడి విడ్డూరమని ఆయన ప్రశ్నించారు.
 
 ఉర్దూ యూనివర్సిటీని ఇతర జిల్లాల్లో పెట్టడానికి తమకు అభ్యంతరం లేదని అయితే తొలుత తమకు హామీ ఇచ్చిన విధంగా వైఎస్సార్ జిల్లాలోనే పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇలా చేయడం అనేది జిల్లాల మధ్య తగాదాలు పెట్టడమేనన్నారు. వైఎస్సార్ జిల్లాను టీడీపీ చిన్న చూపు చూడటం దారుణమని అంజాద్‌బాషా అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement