
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో అనంతవాహినిలా సాగిపోతోంది. మంగళవారం ఉదయం జననేత 260వ రోజు పాదయాత్రను చిన వాల్తేరు కనకమ్మ గుడి సమీపం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి చిన వాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీ, బీచ్ రోడ్ వరకు రాజన్నబిడ్డ పాదయాత్ర కొనసాగనుంది. విశాఖ ఫంక్షన్ హాలులో రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్లతో జరిగే సమావేశంలో జననేత పాల్గొంటారు.
అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యల తోరణాలు, వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర మంగళవారం ప్రారంభమైంది. నైట్క్యాంప్ వద్ద రాజన్న బిడ్డను చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల, ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు.