రైతుల రుణ మాఫీపై ప్రభుత్వం స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షం పదే పదే లేనిపోని ఆరోపణలు చేస్తోందని ప్రభుత్వం వ్యాఖ్యానించింది.
హైదరాబాద్ : రైతుల రుణ మాఫీపై ప్రభుత్వం స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షం పదే పదే లేనిపోని ఆరోపణలు చేస్తోందని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో రుణమాఫీలు 96 శాతం రైతులకు ప్రయోజనం కలిగిస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రుణ మాఫీ అమలు చేశామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కేంద్ర సహాయం లేకుండా అమలు చేశామని వివరించింది. బడ్జెట్లో 5 వేల కోట్లు కేటాయించినంత మాత్రాన రుణమాఫీ అమలు చేయబోమని కాదని ఆర్ధిక మంత్రి యనమల తేల్చి చెప్పారు.
కాగా రుణమాఫీపై అసత్యాలు చెబుతున్న ప్రభుత్వం.. వీలైనంత వరకు భారం తగ్గించుకునే యత్నం చేస్తోందని ప్రధాన ప్రతిపక్షం స్పష్టం చేసింది. పలు నిబంధనలు పెడుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆక్షేపించింది. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు దాదాపు లక్ష కోట్లుంటే బడ్జెట్లో కేవలం అయిదు వేల కోట్లు మాత్రమే కేటాయించారని ప్రధాన ప్రతిపక్షం గుర్తు చేసింది. ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించింది.