పోలీసు మామయ్యే కామ పిశాచి!

Women Complaint On Husbands Father In Guntur - Sakshi

కోరిక తీరిస్తే ఆస్తి మొత్తం రాసిస్తానన్నాడు

న్యాయం చేయాలంటూ బాధితురాలి ఫిర్యాదు 

గుంటూరు: మెట్టినింట్లో తండ్రి పాత్ర పోషించి తనకు అండగా నిలుస్తాడని భావించిన ఆమె తన మామయ్యే కాముకుడిగా మారతాడని ఊహించలేకపోయింది. పోలీస్‌శాఖలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆయన కామ కోర్కెలు తీర్చాలని వేధిస్తుండడంతో తన గోడు భర్తకు వెళ్లబోసుకుంది. భర్త కూడా తన తండ్రికి సహకరించమని సలహా చెప్పడంతో గత్యంతరం లేని స్థితిలో పుట్టింటికి చేరుకుంది. తల్లిదండ్రుల సాయంతో సోమవారం గ్రీవెన్స్‌కు వచ్చి తన గోడు వెళ్లబోసుకుంది. నరసరావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు చిలకలూరిపేటకు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ కె.లక్ష్మీనారాయణ కుమారుడు వెంకట ఈశ్వర్‌తో గతేడాదిలో వివాహం జరిగింది. కుమారుడు ఇంట్లో లేని సమయంలో లక్ష్మీనారాయణ తన కామ కోర్కెలు తీర్చాలని వేధించాడు.

నీవు నాతో శారీరక సంబంధానికి అంగీకరిస్తే ఆస్తి మొత్తం నీపేరుతో పెడతానని ప్రలోభాలకు గురిచేస్తూ వేధించాడు. దీనికి భర్త,అత్త కూడా వంతపాడారు. తను తప్పు చేయనని ఆమె భీష్మించుకు కూర్చుంది. దీంతో ఆమెపై కక్ష కట్టిన అత్తింటివారు..‘మీ అమ్మాయి మా మాట వినడం లేదు. వచ్చి తీసుకెళ్లాలంటూ’ యువతి తల్లిదండ్రులకు ఫోను చేసి పిలిపించి పుట్టింటికి పంపారు. ఇంటికి వెళ్లాక తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని తెలియజేసి ఆమె కన్నీటి పర్యంతమైంది. సోమవారం గుంటూరులో జరిగిన రూరల్‌ ఎస్పీ గ్రీవెన్స్‌లో సీసీఎస్‌ ఏఎస్పీ మూర్తి వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. యువతి ఫిర్యాదును మహిళా ప్రాంగణంలోని సఖి విభాగానికి ఏఎస్పీ సిఫారసు చేసి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top