వరకట్న దాహానికి మహిళ బలి | Woman died in Kamavarapukota | Sakshi
Sakshi News home page

వరకట్న దాహానికి మహిళ బలి

Aug 28 2015 1:11 AM | Updated on Sep 3 2017 8:14 AM

వరకట్న దాహానికి ఓ మహిళ బలయిపోయింది. కట్నం డబ్బు చాలలేదని, పుట్టింటి నుంచి ఇంకా తేవాలంటూ అత్తింటివారు పెట్టిన ఆరళ్లకు ఆమెకు నిండు నూరే ళ్లు నిండిపోయాయి.

కామవరపుకోట : వరకట్న దాహానికి ఓ మహిళ బలయిపోయింది. కట్నం డబ్బు చాలలేదని, పుట్టింటి నుంచి ఇంకా తేవాలంటూ అత్తింటివారు పెట్టిన ఆరళ్లకు ఆమెకు నిండు నూరే ళ్లు నిండిపోయాయి. కామవరపుకోట బీసీ కాలనీకి చెందిన తులసీదుర్గ(24) బుధవారం మృతి చెందింది. తడికలపూడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  నల్లజర్ల మండలం ముసుళ్లకుంటకు చెందిన తులసీదుర్గకు కామవరపుకోటకు చెందిన నిట్టా రామకృష్ణతో 2011లో వివాహమైంది. రామకృష్ణ మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. తరువాత తులసీదుర్గను చేసుకున్నాడు.
 
 వారికి మూడేళ్లు, రెండేళ్ల వయసు కుమారులు ఇద్దరు ఉన్నారు. వివాహ సమయంలో దుర్గ పుట్టింటి వారు కట్నం కింద రూ.25 వేలు ఇచ్చారు. అదనపు కట్నం కావాలంటూ భర్త, అత్తమామలు, మరిది శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆమె పుట్టింటికి వచ్చినప్పుడల్లా తండ్రికి చెప్పేది. ఇదిలా ఉండగా తులసీదుర్గ చనిపోరుుందని ఆమె తండ్రికి అత్తింటివారు బుధవారం తెలిపారు.  వారు వచ్చిన వెంటనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా  తులసీదుర్గ తలపై గాయం కనిపించింది.
 
 దీంతో ఆమెది సహజ మరణం కాదని భావించి బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకటరావు, చింతలపూడి సీఐ దాసు ఆ ఇంటికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. తహసిల్దార్ డీఏ నరసింహరాజు పంచనామా చేశారు. తడికలపూడి ఎస్సై జీజే విష్ణువర్దన్ కేసు నమోదు చేశారు. మృతురాలి తండ్రి చిరింగుల చినవెంకట సుబ్బారావు  ఫిర్యాదు మేరకు ఆమెభర్త రామకృష్ణ, అత్తమామలు, మరిదిపై ఐపీసీ 304బి, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు.మృతదేహాన్ని డాక్టర్ల బృందం పోస్టుమార్టం చేస్తుందని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement