కట్టుకున్నోడే కాలయముడు! | wife murdered by husband | Sakshi
Sakshi News home page

కట్టుకున్నోడే కాలయముడు!

Feb 25 2015 12:50 AM | Updated on Jul 27 2018 2:18 PM

మండలంలోని ఈదుపురంలో వివాహిత హత్య ఘటన సంచలనం రేపుతోంది. గ్రామానికి చెందిన దువ్వు దమయంతి(50) భర్తతో కలిసి జీడి

 ఇచ్ఛాపురం: మండలంలోని ఈదుపురంలో వివాహిత హత్య ఘటన సంచలనం రేపుతోంది. గ్రామానికి చెందిన దువ్వు దమయంతి(50) భర్తతో కలిసి జీడి తోటకు వెళ్లి హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఆమెను భర్త బైరి హత్యచేసి పరారైనట్లు పోలీసులు చెబుతున్నారు. సోమవారంత రాత్రంతా మృతదేహం వద్ద పోలీసులు కాపలా కాశారు. ఇన్‌చార్జి సీఐ సూరినాయుడు, రూరల్ ఎస్సై బి.రామారావు మంగళవారం ఉదయం సంఘటన స్థలం వద్దకు వెళ్లి మృతదేహాన్ని నిశితంగా పరిశీలించారు. దమయంతి ఎడమ నుదిటి పైన, తల వెనుక భాగంలో కత్తి లాంటి ఆయధంతో నరికిన గుర్తులున్నాయి. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం దమయంతి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందించారు.
 
 ఉదయమే హత్య?
 సోమవారం రాత్రి హత్య గురించి తెలిసినప్పటికీ ఉదయమే జరిగినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా దమయంతి, ఆమె భర్త జీడి తోట పనులకు వెళ్తున్నారు. రోజూ కారియర్‌లో భోజనం తీసుకువెళ్లి మధ్యాహ్నం అక్కడే భోంచేసి, సాయంత్రానికి తిరిగి వస్తుంటారు. అయితే మృతదేహానికి సమీపంలో కారియర్  ఉంది.అందులో భోజనం అలానే ఉండటంతో భోజనానికి ముందే అంటే తోటకు వెళ్లిన కొద్ది సేపటికే హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. చాలా కాలంగా ఇంటిలో తన తల్లిని తండ్రి వేధిస్తున్నాడని, తరచూ తన తల్లి భయం వ్యక్తం చేసేదని దమయంతి కుమార్తె రాజులు తమకు వివరించారని రూరల్ ఎస్సై రామారావు తెలిపారు. భర్త బైరికి గతంలో నేరచరిత్ర ఉందని చెప్పారు. ప్రస్తుతం బైరి పరారీలో ఉన్నాడని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement