హైదరాబాద్ నుంచి రెండు మూడు నెలల్లో ఇక్కడికి అందరం తరలి వచ్చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...
విజయవాడ : హైదరాబాద్ నుంచి రెండు మూడు నెలల్లో ఇక్కడికి అందరం తరలి వచ్చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇక్కడ నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు సాగిస్తామన్నారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించారు. రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. విజయవాడకు రాజధాని కళ వచ్చేసిందని ఆయన ప్రకటించారు. ఈ ప్రాంతంలో రాజధానిని వ్యతిరేకించినవారే ఇప్పుడు సమర్థిస్తున్నారని తెలిపారు. రాజధాని నిర్మాణంపై కూడా పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 90 శాతం భూసమీకరణ పూర్తయిందని, మిగిలిన 10 శాతం కోసం అవసరమైతే భూసేకరణ చట్టం ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రులు రాజనాథ్సింగ్, అరుణ్జైట్లీ, వెంకయ్యనాయుడులతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు బుధవారం ప్రధాని నరేంద్రమోదీతో రాష్ట్ర సమస్యలపై మాట్లాడారు. ఇదే విషయాన్ని ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై సమీక్ష
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎస్ఎల్జీ గ్రూపు చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర సీఎంతో భేటీ అయ్యారు. నూతన రాజధాని నిర్మాణం, పరిశ్రమలకు రాష్ట్రంలో కల్పిస్తున్న అవకాశాలను చంద్రబాబు ఆయనకు వివరించారు. ఉదయం రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు, పరిశ్రమలకు కావాల్సిన నీరు తదితర అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇదే సమయంలో రాజధాని కోసం ఇప్పటివరకు జరిగిన భూసమీకరణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధి, రేషనలైజేషన్ తదితర అంశాలపై విద్యాశాఖాధికారులతో సమీక్షించారు.
పర్యాటక రంగంలో ఏపీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని జీ గ్రూపు చైర్మన్ సుభాష్చంద్ర అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన మాట్లాడుతూ అవకాశమిస్తే తాము తూర్పు ఆసియా దేశాల మధ్య జలమార్గాలలో క్రూయిజ్ వసతులు కల్పించి టూరిజంలో ఏపీని హబ్గా చేసుకుంటామని తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు సిద్ధమేనని ప్రకటించారు. ఏపీతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. శ్రీసిటీలో సౌరవిద్యుత్ పరికరాల ఉత్పత్తి ప్రారంభించేందుకు ఆయన ఆసక్తి కనబరిచారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి బుధవారం రాత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి త్వరలో గైడ్లైన్స్ విడుదల చేస్తారు.