నవంబర్ 1 నుంచి ఓటర్ల నమోదు | Sakshi
Sakshi News home page

నవంబర్ 1 నుంచి ఓటర్ల నమోదు

Published Sun, Sep 28 2014 3:49 AM

Voters name to be enrolled from November 1

రెండు రాష్ట్రాల్లో 25వ తేదీ వరకు కార్యక్రమం
 జనవరి 5న తుది జాబితా ప్రకటన


సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నవంబర్ 1వ తేదీ నుంచి ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. నవంబర్ 1వ తేదీన ఓటర్ల జాబితాను ప్రకటించిన అనంతరం 25వ తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడతారు. ఈ మధ్య కాలంలో ఆదివారాలైన నవంబర్ 9, 16, 23వ తేదీల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతారు. ఆ రోజుల్లో బూత్ స్థాయి ఆఫీసర్లు, బూత్ స్థాయి రాజకీయ పార్టీల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల్లో సమావేశమవుతారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్లు అక్కడకు వెళ్లి ఓటర్‌గా నమోదుకు దరఖాస్తులను అందజేయవచ్చు.
 
 ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు కూడా దరఖాస్తులను అందజేయవచ్చు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరిని ఓటర్‌గా నమోదు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. 25వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఓటర్ల జాబితాలోకి చేర్చుతారు.  తుది జాబితాను వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన ప్రకటించనున్నారు. ఓటర్ల నమోదు కార్యక్రమం సమయంలో జిల్లా కలెక్టర్లు, ఆర్‌డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ల బదిలీలపై నిషేధం విధించనున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆ రాష్ట్రాల ప్రభుత్వ సీఎస్‌లకు శనివారం ఫైళ్లు పంపించారు.

Advertisement
Advertisement