
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి శుక్రవారం కలిశారు. వైకుంఠ ఏకాదశి రోజు పార్లమెంట్లోని ప్రధాని ఛాంబర్లో ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో మోదీతో మర్యాదపూర్వకంగా విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డికి మోదీ వైకుంఠ ఏకాదశి విషెస్ చెప్పారు.
దాదాపు 15 నిమిషాలపాటు సాగిన భేటీలో రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్విజయంగా కొనసాగిస్తోన్న ప్రజాసంకల్పయాత్ర వివరాలను, పాదయాత్రకు వస్తున్న విశేష స్పందన గురించి ప్రధాని మోదీకి విజయసాయిరెడ్డి తెలిపారు. గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ, హిమాచల్ ప్రదేశ్ సీఎంగా జైరాం ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేసి నూతన ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.