యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి సుందరపు విజయ్కుమార్ తిరుగుబావుటా అంతటా చర్చనీయాంశమవుతోంది.
యలమంచిలి : యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి సుందరపు విజయ్కుమార్ తిరుగుబావుటా అంతటా చర్చనీయాంశమవుతోంది. రెబల్గా అతని పోటీతో తమ పార్టీ ఓట్లకు గండి తప్పదన్న వాదన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఆయనను బరిలోనుంచి తప్పించడానికి సామదాన దండోపాయాలకు అధిష్టానం సిద్ధమవుతోంది.
యలమంచిలి టీడీపీ టికెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్కుమార్కు మొండిచెయ్యి చూపడంతో రెబల్గా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. స్థానికేతరుడైన పంచకర్ల రమేష్బాబుకు కేటాయించడాన్ని తెలుగు త మ్ముళ్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గం పరిధి లో 38 మంది పార్టీ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలుపొందడంలో కీలకపాత్ర పోషించిన విజయ్కుమార్ను కాదనడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ పరిస్థితుల్లో పంచకర్ల తనదైనశైలిలో పావులు కదుపుతున్నారు. ఇప్పటికే విశా ఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు, స్థానిక ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు, మాజీ ఎంపి పప్పల చలపతిరావు తదితర ముఖ్యనాయకులను ప్రసన్నం చేసుకున్నారు.
సుందరపు బరిలో ఉంటే తనకు ఏమేరకు నష్టం జరుగుతుందన్న విషయాలను ఆరాతీస్తున్నట్టు తెలి సింది. అతనికి ఏఏ గ్రామాల్లో బలం ఉందన్న విషయాలను పరిశీలిస్తున్నట్టు భోగట్టా. నామినేషన్ల ఉపసంహరణకు రెండు రోజులే గడువు ఉండడంతో నష్టం అంచనాలో నాయకులు తలమునకలవుతున్నారు. విజయ్కుమార్ను ఏవిధంగా పోటీ నుంచి తప్పించాలన్న విషయమై ముఖ్యమైన నేతలతో చర్చిస్తున్నట్టు తెలిసింది.