‘సమైక్యం’పై నీళ్లు! | 'United' on the water! | Sakshi
Sakshi News home page

‘సమైక్యం’పై నీళ్లు!

Sep 22 2013 1:17 AM | Updated on Sep 1 2017 10:55 PM

విమానాశ్రయం, పారిశ్రామికవాడ ఏర్పాటు, ఆర్కిటెక్చర్ కళాశాల అభివృద్ధికి ఆమోదం ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్నా ఆకస్మికంగా నిర్ణయం ప్రపంచబ్యాంకు రుణ లింకు నిధులు వచ్చేదెప్పుడో?

విమానాశ్రయం, పారిశ్రామికవాడ ఏర్పాటు, ఆర్కిటెక్చర్ కళాశాల అభివృద్ధికి ఆమోదం ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్నా ఆకస్మికంగా నిర్ణయం ప్రపంచబ్యాంకు రుణ లింకు నిధులు వచ్చేదెప్పుడో? అమలు జరిగేదెప్పుడో? ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు
 
సాక్షి, మచిలీపట్నం : సమైక్య ఉద్యమంపై నీళ్లు చల్లేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్ర విభజన ప్రకటనతో రగిలిపోతున్న జిల్లా వాసులను శాంతింపజేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రపంచబ్యాంకు నుంచి అప్పుతెచ్చి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామంటూ ప్రతిపాదనలు చేసింది. కీలకమైన విమానాశ్రయం, పారిశ్రామిక రంగం అభివృద్ధి, ప్లానింగ్, ఆర్కిటెక్చర్ సంస్థ ఏర్పాటు తదితర వరాల జల్లు కురిపించింది.

ఇందుకు శుక్రవారం హైదరాబాదులో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. రెండు నెలల విరామం తరువాత జరిగిన మంత్రివర్గ సమావేశం కేవలం ప్రపంచబ్యాంకు ఇచ్చే అప్పుపై ఆధారపడి అభివృద్ధి ప్రతిపాదనలు చేయడం శోచనీయం. రాష్ట్రంలో 2009-10లో వచ్చిన భారీ వరదలకు దెబ్బతిన్న రోడ్లు, మంచినీటి వనరులు, విద్యా సంస్థల అభివృద్ధికి ప్రపంచ బ్యాంకును అడిగిన వెయ్యి కోట్ల రూపాయల అప్పు వస్తే అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు చేయడం గమనార్హం.

 ఉద్యమ ప్రభావాన్ని తగ్గించేందుకే ఎత్తులు..

 రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న తరుణంలో జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధిపై హామీలు గుప్పిస్తే.. సమైక్య ఉద్యమ ప్రభావాన్ని తగ్గించవచ్చన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎత్తులు వేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోనే అత్యంత కీలకమైన గన్నవరం విమానాశ్రయం దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోలేదు. విజయవాడ నగరానికి అత్యంత చేరువలో ఉన్న గన్నవరం విమానాశ్రయం విస్తరణకు చేసిన ప్రతిపాదనలు ఏళ్ల తరబడి అడుగు ముందుకు పడలేదు. విమానాశ్రయాన్ని విస్తరించేందుకు అవసరమైన భూసేకరణకు గత రెండేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు.

ప్రస్తుతం దీని అభివృద్ధిపై మంత్రివర్గం హడావుడిగా ఆమోదముద్ర వేసింది. పారిశ్రామిక అభివృద్ధి విషయంలోనూ అదే పరిస్థితి. జిల్లాలో ఎన్నో ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన ఈ రంగం అభివృద్ధికి హఠాత్తుగా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం అందులో భాగమేనని పేర్కొంటున్నారు. జగ్గయ్యపేటకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం 498 ఎకరాలను ఏపీఐఐసీకి అప్పగించేందుకు నిర్ణయించింది.

జయంతిపురం గ్రామం గుంటూరు-కృష్ణా జిల్లాల సరిహద్దున ఉండటమే కాకుండా తెలంగాణలోని నల్గొండ జిల్లాకు కూడా ఇది సరిహద్దు గ్రామం కావడం గమనార్హం. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో అక్కడ తండా(ఎస్టీ)లు నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతంలో సుమారు 30 ఏళ్ల నుంచి మద్రాసు సిమెంట్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) ఫ్యాక్టరీ, ఇటీవల మరో ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేశారు. అక్కడ యూరియా, పవర్‌ప్లాంట్ తదితర పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటూ జిల్లాకు చెందిన నేతలు మూడేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. ఇప్పుడు దానిపై అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 ఆర్కిటెక్చర్ కళాశాల ఏర్పాటుకు ఆమోదముద్ర

 విజయవాడ నగర సమీపంలో ప్లానింగ్, ఆర్కిటెక్చర్ కళాశాల ఏర్పాటుకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందుకు అవసరమైన స్థలాన్ని సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేలా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పటమటలో ఈ కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలం విషయంలో జిల్లా ఉన్నతాధికారులు ఆరు నెలల క్రితమే ప్రభుత్వానికి నివేదించగా, పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 9.66 ఎకరాలు కేటాయించింది. మొత్తానికి సమైక్య సెగతో కకావికలమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం సీమాంధ్రకు వరాల వర్షం కురిపించడం ద్వారా ఉద్యమ సెగ చల్లార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచిచూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement