సమైక్య జడి | united agitation become severe in Ananthapuram district | Sakshi
Sakshi News home page

సమైక్య జడి

Oct 24 2013 2:45 AM | Updated on Jun 1 2018 8:47 PM

జిల్లాలో సమైక్య పోరు ఉధృతంగా కొనసాగుతోంది. ఉద్యమకారులు ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ గొంతెత్తి నినదిస్తున్నారు.

సాక్షి, అనంతపురం :  జిల్లాలో సమైక్య పోరు ఉధృతంగా కొనసాగుతోంది. ఉద్యమకారులు ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ గొంతెత్తి నినదిస్తున్నారు. వీరికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా జడివాన కురుస్తున్నా... ఉద్యమ హోరు మాత్రం తగ్గలేదు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పల్లెపల్లెకూ విస్తరింపజేయాలన్న లక్ష్యంతో అనంతపురంలోని ఎన్‌జీఓ హోంలో జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, ఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాజు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి.. ఉద్యోగులతో సమావేశమై ‘సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ’ని ఏర్పాటు చేశారు. అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో వైద్యులు సమావేశమై.. ఉద్యమ కార్యాచరణపై చర్చించారు.
 
 రాష్ట్ర విభజన జరిగితే నీటి కష్టాలు మొదలవుతాయని జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నగరంలో ఖాళీ కుండలతో నిరసన ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు బైక్ ర్యాలీ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో విద్యార్థి సంఘాల నాయకులు దీక్షలు కొనసాగించారు.
 
 దర్మవరం, గుంతకల్లు, పామిడిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పామిడి, బెళుగుప్పలో విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. మానవహారం నిర్మించారు. కుందుర్పిలో విద్యార్థులు, జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి.. మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. గాడిదకు వినతిపత్రం అందజేశారు. మడకశిర మండలం గౌడనహళ్లిలో విద్యార్థులు ఖాళీ ప్లేట్లు చేత బట్టుకుని ర్యాలీ చేపట్టారు. కణేకల్లులో విద్యార్థులు, తాడిపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్థుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.  
 

Advertisement
 
Advertisement
Advertisement