కొత్తకొత్తగా చదివిద్దాం | UGC announces new teaching plans | Sakshi
Sakshi News home page

కొత్తకొత్తగా చదివిద్దాం

Sep 3 2018 2:35 AM | Updated on Sep 3 2018 2:35 AM

UGC announces new teaching plans - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో బోధనాభ్యాసన ప్రక్రియల్లో సమూల మార్పులకు కేంద్ర మానవవనరుల శాఖ నిర్ణయించింది. పాత మూస ధోరణులను వదిలి అధునాతన ప్రణాళికలు, బోధనా విధానాలు అనుసరించేలా కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. అండర్‌ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులకు సంబంధించి వర్సిటీలతో పాటు అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో వీటిని పాటించాల్సిందిగా సూచించింది. ఆయా సంస్థల్లో ఇకపై విద్యార్థి కేంద్ర బిందువుగా పాఠ్య ప్రణాళిక, బోధనాభ్యాసన విధానాలను అమలుచేయాల్సి ఉంటుంది. ‘స్టూడెంట్‌ ఇండక్షన్‌ ప్రోగ్రామ్‌’ పేరిట ఈ మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్‌ (యూజీసీ) విడుదల చేసింది. 2018–19 విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలుచేసేలా ఉన్నత విద్యాసంస్థలన్నీ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. విద్యార్థులను నూతన ఆలోచనల దిశగా ముందుకు తీసుకువెళ్లడం.. సామాజిక అంశాలపై సునిశితంగా స్పందించడం.. నైతిక విలువలను పెంపొందించుకోవడం.. బాధ్యతాయుత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడం ఇందులోని ప్రధాన లక్ష్యంగా నిర్దేశించారు. 

కొత్తవిధానంలో ప్రధానాంశాలు.. 
ప్రస్తుతం నాలుగు గోడల మధ్య పుస్తకాల ఆధారంగా సాగే బోధనకు బదులు ఈ కొత్త విధానం సామాజికీకరణ, అనుసంధానత, పాలనా భాగస్వామ్యం, అనుభవీకరణ అనేవి ప్రధానాంశాలుగా ఈ నూతన విధానంలో పొందుపరిచారు.  
- కొత్తగా కాలేజీల్లో చేరే విద్యార్థులు సౌకర్యవంతంగా తమ చదువు కొనసాగించేందుకు సీనియర్‌ విద్యార్థులు, అధ్యాపకులతో మార్గనిర్దేశం చేస్తారు. దీనివల్ల విద్యార్థులు ఉత్సాహపూరిత వాతావరణంలో చదువుకునేందుకు వీలుంటుంది.  
సంస్థలోని విద్యార్థులు, అధ్యాపకుల మధ్య అనుబంధం ఏర్పడేలా చేయాలి.  
సంస్థ విధానాలు, కార్యక్రమాలు, విలువలు, మెంటార్‌ గ్రూపులపై ముందుగా వారికి అవగాహన కల్పించాలి.  
నిపుణులతో ఉపన్యాసాలు ఇప్పించాలి. ఆయా విద్యా సంస్థల పరిధిలోని స్థానిక అంశాలపై అవగాహన కలిగేలా విద్యార్థులతో పర్యటనలు చేయించాలి.  
గ్రూపు చర్చలు, సబ్జెక్టు అంశాలపై ప్రసంగాలు, అభ్యసన నైపుణ్యాలు, కళలు, సాహిత్యం, సాంస్కృతిక, మానవతా విలువలు తదతర అంశాలపై కార్యక్రమాలు నిర్వహించి వారిలో అనుభవాలను ప్రోదిచేయాలి.  

మెంటరింగ్‌.. కనెక్టింగ్‌ 
ఈ కొత్త విధానంలో విద్యార్థులకు ఫ్యాకల్టీ సభ్యులతో అనుసంధానించడం (మెంటార్‌షిప్‌) అతిముఖ్యమైనది. ఇది విద్యార్థులు, అధ్యాపకుల మధ్య ఆరోగ్యకరమైన బంధాన్ని నెలకొల్పుతుంది. దీనివల్ల విద్యార్థులు కొత్త అనుభవాలతో మరింత వికాసాన్ని పొందడంతో పాటు అభ్యసనంలో మరింత ఉత్సాహాన్ని పొందగలుగుతారు. మెంటార్‌షిప్‌ వల్ల ఒత్తిడికి గురికాకుండా ధైర్యంగా ముందుకు వెళ్లగలిగే స్వభావాన్ని అలవర్చుకుంటారు. కులమతాలకు అతీతంగా ఒక దేశ పౌరుడిగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలపై విద్యార్థి ఆలోచించేలా చేయాలి. ఈ మెంటారింగ్‌లో.. అంశాలను ఎంచుకోవడం, ఏం చేయాలో.. ఏం చేయరాదో అన్నవాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించడం మెంటార్ల ప్రధాన బాధ్యత. వివిధ అంశాలపై ఆరు రోజుల పాటు మెంటార్‌షిప్‌ కొనసాగించాలి. ప్రతీ మెంటార్‌ పరిధిలో 20 మంది చొప్పున గ్రూప్‌ను ఏర్పాటుచేయాలి. విద్యార్థులు తమ జీవితంపట్ల, సమాజంలో తాను పోషించాల్సిన పాత్రపట్ల స్పష్టమైన అవగాహనకు వచ్చేలా చూడాలి. అంతేకాక.. విద్యార్థులు వేరు, విద్యా సంస్థ వేరు అనేలా కాకుండా మొత్తం ఒక కుటుంబం మాదిరిగా ఉండేలా విద్యా సంబంధిత కార్యక్రమాలు, సదస్సులు, ప్రయోగశాలలు, తదితర కార్యక్రమాలు పెంపొందించాలి. అలాగే, వీటి ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉండాలి. సెమిస్టర్‌ పూర్తయిన అనంతరం ప్రతీవారం ఓ గంట ప్రతీ మెంటార్‌ గ్రూపు సమావేశమవ్వాలి.

క్రీడల్లో భాగస్వాముల్ని చేయాలి 
విద్యార్థులను కేవలం బోధన, పుస్తక పఠనాలకే పరిమితం చేయకుండా క్రీడల్లో భాగస్వాముల్ని చేయాలి. ప్రతిరోజూ సాయంత్రం లేదా స్థానిక వాతావరణానికి వీలుగా అనువైన సమయాల్లో వీటిని చేపట్టాలి. ఇవి సమిష్టి కృషికి తోడ్పడతాయి. ప్రతీ విద్యార్థి ఏదో ఒక క్రీడాంశంలో పాల్గొనేలా చేయాలి. ఆ తరువాత దానిలో నైపుణం సాధించేలా తీర్చిదిద్దాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement