ఆటవస్తువులా భావించి ఇద్దరు చిన్నారులు బాంబుతో ఆడుకుంటుండగా అది పేలింది.
బొబ్బిలి (విజయనగరం) : ఆటవస్తువులా భావించి ఇద్దరు చిన్నారులు బాంబుతో ఆడుకుంటుండగా అది పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరావుపేటలో శనివారం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్న గౌరీ శంకర్(11), ఆరో తరగతి చదువుతున్న పెరుగు స్వామి(12)లు స్కూల్లో ఆడుకుంటున్న సమయంలో బాంబు దొరికింది.
వారు దాన్ని ఆట వస్తువుగా భావించి ఇంటి వద్దకు తెచ్చుకుని ఆడుకుంటుండగా ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.