మళ్లీ కంటి తుడుపేనా? | Tudupena eye again? | Sakshi
Sakshi News home page

మళ్లీ కంటి తుడుపేనా?

Dec 29 2013 1:54 AM | Updated on Sep 2 2017 2:04 AM

రైతన్నలను సర్కార్ ఊరిస్తోంది. నష్టపోయిన పంటకు పరిహారాన్ని కంటి తుడుపుగా విడుదల చేసింది. అది కూడా ఏళ్లు గడిచాక విదిల్చింది.

=2011 కరువు సాయం ఎట్టకేలకు విడుదల
 =తాజాగా రూ.2.78కోట్లు
 =పెండింగ్‌లో మరో రూ.1.26కోట్లు
 =గిరిజన రైతులకు అందని నీలం పరిహారం   
 =28 వేల మంది ఎదురుచూపు

 
సాక్షి, విశాఖపట్నం: రైతన్నలను సర్కార్ ఊరిస్తోంది. నష్టపోయిన పంటకు పరిహారాన్ని కంటి తుడుపుగా విడుదల చేసింది. అది కూడా ఏళ్లు గడిచాక విదిల్చింది. ఈలోపు  చేసిన అప్పులు, వడ్డీ లు పేరుకుపోయి నిలువునా అన్నదాతలు మునిగిపోయారు. 2011లో జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. లక్షలాది మంది రైతులు పంటలను కోల్పోయారు. ఈ క్రమంలో ఇన్‌ఫుట్ సబ్సిడీగా రూ.17.5కోట్లు విడుదల చేయాలంటూ వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

అప్పట్లో సర్కార్ వెంటనే స్పందించలేదు. గతేడాది చివరిలో 96,219మంది రైతులకు   రూ.13.46కోట్లు  విడుదల చేసింది. తాజాగా మళ్లీ 20,364మంది రైతులకు సంబంధించి రూ.2.78 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రూ.1.26కోట్లు మేర పెండిం గ్‌లో ఉంచింది. ఇక గతేడాది నీలం తుఫాన్ కారణంగానూ జిల్లా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. రూ.30.24కోట్లు మేర ఇన్‌ఫుట్ సబ్సిడీ మంజూరు చేయాలంటూ వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.

ఇందులో ఈ ఏడాది ఆరంభం, ఖరీఫ్ సీజన్‌కు ముందు రెండు విడతలుగా రూ.23కోట్లు విడుదలయ్యాయి. కానీ ఏజెన్సీలో పంట నష్టపోయిన 28వేల మంది రైతులకు సంబంధించి పైసా కూడా విదల్చలేదు. వాస్తవానికి వీరికి రూ.4.61కోట్లు చెల్లించాల్సి ఉంది. వీరందరికీ చెక్కుల రూపంలోనే పంపిణీ చేయాల్సి ఉంది.  పరిహారం కోసం గిరిజనులంతా ఎదురు చూస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement