వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశాలు శుక్రవారం కర్నూలు, నంద్యాలలో నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశాలు శుక్రవారం కర్నూలు, నంద్యాలలో నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం నగరంలోని దేవీ ఫంక్షన్ హాలులో ఉదయం నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి కర్నూలు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గ నాయకులతో పాటు నందికొట్కూరు నియోజకవర్గం, ఓర్వకల్లు, కల్లూరు మండలాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరుకావాలని కోరారు.
అదే రోజు సాయంత్రం నంద్యాలలో నిర్వహించనున్న సమావేశానికి ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లి, డోన్, శ్రీశైలం నియోజకవర్గాలతో పాటు పాణ్యం, గడివేములకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కావాలన్నారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ సమీక్షలో పాల్గొనాలన్నారు. వీరితో పాటు ఆయా మండల, గ్రామస్థాయి నాయకులు, జిల్లా, కేంద్ర కమిటీ సభ్యులు కూడా హాజరవ్వాలని పిలుపునిచ్చారు. సమీక్షలో త్రిసభ్య కమిటీ సభ్యులు జగ్గారెడ్డి, విశ్వరూప్, ప్రవీణ్కుమార్రెడ్డి హాజరుకానున్నట్లు గౌరు పేర్కొన్నారు.