రేపు కోలగట్ల నామినేషన్‌ | Sakshi
Sakshi News home page

రేపు కోలగట్ల నామినేషన్‌

Published Tue, Mar 19 2019 1:05 PM

 Tomorrow Nominations For Kolagatla Veerabhadra Swamy - Sakshi

సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విజయనగరం శాసనసభా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్సీ, ఆ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ఈ నెల 20న నామినేషన్‌ను దాఖలు చేయనున్నట్లు పార్టీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి కోలగట్ల తమ్మన్నశెట్టి వెల్లడించారు. 


సోమవారం ఎమ్మెల్సీ కోలగట్ల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు, మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు విజయనగరం మండల తహసీల్దార్‌ కార్యాలయంలో కోలగట్లతో పాటు మరో ఐదుగురు వెళ్లి నామినేషన్‌ దాఖలు చేయనున్నారని తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎటువంటి ఆడంబర కార్యక్రమాలు నిర్వహించవద్దని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. 


మాట తప్పని నాయకునికి మద్దతు పలకండి
రాష్ట్రంలో ఐదేళ్లపాటు జరిగిన నయవంచనకు పాలనకు స్వస్తిపలికి... తప్పని, మడమ తిప్పని నాయకునిగా  గుర్తింపు సాధించిన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బలపర్చిన ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామికి నియోజకవర్గ ప్రజలు మద్దతు పలకాలని తమన్నశెట్టి కోరారు. జగనన్న తోనే రాజన్న రాజ్యం సాధ్యమనీ, అటువంటి సంక్షేమ రాజ్యం కోసం అందరూ తమ ఓటును కోలగట్ల వీరభద్రస్వామికి వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్, మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement