
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన పాతపట్నం సమీపంలోని సీది గ్రామానికి చెందిన యువకుడికి నెగటివ్ వచ్చినా అతని కుటుంబ సభ్యులు ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. వారికి కరోనా లక్షణాలు లేనప్పటికీ వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడం గమనార్హం. అధికారుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం..
► ఢిల్లీ రైల్వేలో పనిచేస్తున్న యువకుడు గత నెల 19న స్వస్థలానికి వచ్చాడు. అప్పటి నుంచి కాగువాడ గ్రామంలోని అత్తవారింటిలో కుటుంబంతో కలిసి ఉన్నాడు.
► ఢిల్లీ నుంచి అతను ప్రయాణించిన రైలులో మర్కజ్కు వెళ్లివచ్చిన వారు ఉన్నట్లు గుర్తించాడు. దీంతో అధికారులు అతన్ని హోమ్ ఐసోలేషన్లో ఉంచారు.
► ఢిల్లీలో తిరిగి విధుల్లో చేరేందుకు మెడికల్ సర్టిఫికెట్ కోసం పాతపట్నం సీహెచ్సీలో ట్రూనాట్ పరీక్ష చేయించుకోగా కరోనా లక్షణాలు కనిపించాయి. కానీ, శ్రీకాకుళంలోని జెమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో నమూనా తీసి పరీక్షించగా నెగటివ్ వచ్చింది. అత్తింటి వారినీ పరీక్షించగా వారిలో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది.
► 28 రోజులు క్వారంటైన్ గడువు ముగిశాక అతను వివిధ ప్రాంతాలలో సంచరించాడు.
► అతనితో కాంటాక్ట్ అయిన 29 మందిని శుక్రవారం, 67 మందిని శనివారం క్వారంటైన్కు పంపించారు.
► మరోవైపు.. కాగువాడకు 3 కిలోమీటర్ల పరిధిలో గల పాతపట్నంతోపాటు కాగువాడ, సీది, కొరసవాడ, చుట్టుపక్కల 18 గ్రామాలను పూర్తిగా లాక్డౌన్ చేశారు.