రుణమాఫీ సహా రాష్ట్రానికి సంబంధించిన కీలకాంశాలపై స్పష్టత ఇవ్వడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర సమితి విమర్శించింది.
ప్రభుత్వంపై సీపీఐ ధ్వజం
హైదరాబాద్: రుణమాఫీ సహా రాష్ట్రానికి సంబంధించిన కీలకాంశాలపై స్పష్టత ఇవ్వడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర సమితి విమర్శించింది. ఎన్నికల వాగ్దానాల అమలు, రాష్ట్ర బడ్జెట్, రాజధాని ఎంపిక పై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి ప్రజలకు స్పష్టత ఇవ్వడానికి బదులు అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారని ఆక్షేపించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఓబులేసు ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. లక్షలాది మంది ఎదురుచూస్తున్న రుణమాఫీని ఎప్పటినుంచి అమలు చేస్తారో చెప్పడానికి బదులు హామీకి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెప్పడం అన్యాయమన్నారు.
రాష్ట్రం ఆర్ధిక లోటుతో కొట్టుమిట్టాడుతోందని శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం.. రూ.1,11,824 కోట్లతో బడ్జెట్ను ఎలా ప్రవేశపెట్టిందని ప్రశ్నించారు. మాజీ శాసనసభ్యులకు నాలుగు నెలలుగా పింఛన్ ఇవ్వడానికి డబ్బుల్లేవన్న ప్రభుత్వం.. మంత్రుల ఇంటి అద్దెను లక్ష రూపాయలకు ఎలా పెంచిందని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధానిపై అఖిల పక్షంతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తే బాగుండేదన్నారు. కౌలు రైతులకు కూడా రుణమాఫీ వర్తింపజేయాలని కోరారు. వారికి రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా చేయనున్నట్టు తెలిపారు.