రక్తదానం చేయడం అవయవ దానం చేయడం లాంటిదేనని.. రక్తదానానికి విలువ కట్టలేమని రిమ్స్ డెరైక్టర్ సిద్దప్ప గౌరవ్ పేర్కొన్నారు.
రిమ్స్ డెరైక్టర్ సిద్దప్ప గౌరవ్
కడప కల్చరల్: రక్తదానం చేయడం అవయవ దానం చేయడం లాంటిదేనని.. రక్తదానానికి విలువ కట్టలేమని రిమ్స్ డెరైక్టర్ సిద్దప్ప గౌరవ్ పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా శనివారం కడప నగరంలోని బోగా పార్వతమ్మ బ్లడ్ బ్యాంకులో నిర్వహించిన రక్తదాతల సత్కారోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శరీరంలో ఏ అవయవం దానం చేసినా కొరతగానే ఉంటుందని.. కానీ, రక్తాన్ని దానం చేస్తే కొద్ది రోజుల్లో తిరిగి తయారవుతుందని ఆయన తెలిపారు. రక్తదానంపై మన దేశంలో అవగాహన పెరగవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
బ్లడ్ బ్యాంకు నిర్వాహకులు బోగా పార్వతమ్మ రక్తదాన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బోగా చిన్నయ్య మాట్లాడుతూ రక్తదాన దినోత్సవ సందర్బంగా రక్తదాతలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
కరపత్రాలు విడుదల.. అనంతరం బోగా పార్వతమ్మ బ్లడ్ బ్యాంకు రూపొందించిన కరపత్రాలను రిమ్స్ డెరైక్టర్ సిద్దప్పగౌరవ్ విడుదల చేశారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, బ్లడ్ బ్యాంకు ప్రతినిధి భూపతి కూడా ప్రసంగించారు. అనంతరం 20 సార్లకు పైగా రక్తదానం చేసిన వారిని, ప్రోత్సహించిన డాక్టర్ మల్లికార్జునను శాలువతో సత్కరించారు.