నత్త నడకే | the construction of a railway line not perfect | Sakshi
Sakshi News home page

నత్త నడకే

Jan 3 2014 3:56 AM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్, పెద్దపల్లి రైల్వే లైన్ నిర్మాణ పను లు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి.

మోర్తాడ్, న్యూస్‌లైన్: నిజామాబాద్, పెద్దపల్లి రైల్వే లైన్ నిర్మాణ పను లు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి. దాదాపు నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన పనులు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం గత మార్చిలోగానే మోర్తాడ్ నుంచి జగిత్యాల వరకు ప్యాసింజర్ రైలును నడపాల్సి ఉంది. ఏడా ది సమీపిస్తున్నా దానికి అతీగతీ లేకుండా పోయింది. భూసేకరణలో అంతరాయం, కాంట్రాక్టర్ల అలసత్వం తో నిజామాబాద్ నుంచి మోర్తాడ్ వరకు పనులు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
 
 ‘ప్యాసింజర్’ వస్తుందన్నారు
 మోర్తాడ్ నుంచి జగిత్యాల మీదుగా పెద్దపల్లి, చెన్నూర్ వరకు ప్యాసింజర్ రైలు నడుపుతామని రైల్వే శాఖ ఉ న్నతాధికారులు గతంలో ప్రకటించారు. తొలుత జగి త్యాల, మోర్తాడ్ మధ్య రైలును నడుపుతామని, ఇది సక్సెస్ అయితే వారం రోజులలో చెన్నూర్ వరకు పొడి గిస్తామని అప్పుడు అధికారులు పేర్కొన్నారు. ఇది అమలులోకి రావాలంటే ముందుగా మోర్తాడ్ వరకు రైల్వే లైన్ పనులు పూర్తి చేయాలి.
 
 కానీ, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి వరకే పనులు జరిగాయి. మెట్‌పల్లి, మోర్తాడ్ మధ్య పనులలో తీవ్ర జాప్యం జరిగింది. మోర్తాడ్ వద్ద జరుగుతున్న ‘చౌట్‌పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనుల ఆలస్యం కూడా దీనిపై ప్రభావం చూపింది. ఈ  పనులు ఇటీవలే పూర్తయ్యాయి. రైల్వే లైన్ వెంట వర్షపు నీరు వెళ్లిపోవడానికి కాలువలు నిర్మించాల్సి ఉంది. మోర్తాడ్‌కు వెళ్లే దారిలో వంతెన నిర్మాణం పూర్తికాగా, ఇక్క డ పట్టాలు వేసి కంకర పోయాల్సి ఉంది. రైల్వే స్టేషన్ పరిసరాలలో కూడా లైన్ పనులు పూర్తి కావాలి.
 
 అంతులేని నిర్లక్ష్యం
 పనులను సజావుగా సాగించడంలో మొదటి నుంచి కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చూపుతున్నారు. ప్రభుత్వం నిధులు సకాలంలో విడుదల చేసినా పనులు మాత్రం చురుకుగా ముందుకు సాగడం లేదు. ఆలస్యానికి నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ల నుంచి ప్రభుత్వం జరిమానా వసూలు చేస్తున్నా స్పందన అంతంత మాత్రంగానే ఉంది. మోర్తాడ్ రైల్వే స్టేషన్ నుంచి నిజామాబాద్ రూటులో పెద్దవాగు వద్ద వంతెన నిర్మించాల్సి ఉంది. ఈ పనులు గత ఏడాది మొదలైనా ఇప్పటివరకు 50 శాతం కూడా పూర్తి కాలేదు. వంతెనపై ఏర్పాటు చేయాల్సిన ప్లేట్లు సిద్ధమైనా, పిల్లర్‌ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో అవి వృథాగా ఉండిపోయాయి.
 
 ప్రజాప్రతినిధులేరీ?
 రైల్వే పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ప్రజాప్రతినిధులు ముఖం చాటేయడం, అధికారులు కాంట్రాక్టర్ల చెప్పు చేతలలో ఉండటంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పట్టించుకునే వారు లేకపోవడంతో ఈ రైల్వే లైన్ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement