తాగునీటి భారం | The burden of drinking water | Sakshi
Sakshi News home page

తాగునీటి భారం

Nov 20 2015 11:59 PM | Updated on Sep 29 2018 5:21 PM

ఆర్థిక సంఘం నిధులు ఇచ్చినట్టే ఇచ్చి లాక్కుంటున్న ప్ర భుత్వం తాజాగా తాగునీటి పథకాల నిర్వహణ భారం పంచాయతీల నెత్తిన

పథకాల నిర్వహణ పంచాయతీలదే
సర్కారు నిర్ణయం
గ్రామాలకు మరిన్ని ఆర్థిక తిప్పలు
 

ఆర్థిక సం ఘం నిధులు ఇచ్చినట్టే ఇచ్చి లాక్కుంటున్న ప్ర భుత్వం తాజాగా తాగునీటి పథకాల నిర్వహణ భారం పంచాయతీల నెత్తిన పెట్టింది. ఇప్పటికే గ్రామాల్లో విద్యుత్ దీపాల బిల్లుల చెల్లింపును అప్పగించిన వైనం తెలిసిందే. వచ్చే ఐదు రూ.లక్షల్లో సగం వీటికే ఖర్చుచేయాల్సి రావడంతో ఏ మేరకు అభివృద్ధి పనులు చేపడతామని సర్పంచ్‌లు వాపోతున్నారు. సీపీడబ్ల్యూ స్కీంల నిర్వహణను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తోంది.
 
విశాఖపట్నం : జిల్లాలోని 925 పంచాయతీల పరిధిలో 18,485 చేతిపంపులు, 2765ఎన్‌పీడబ్ల్యూ, పీడబ్ల్యూస్కీమ్‌లు, 29 సీపీడబ్ల్యూ స్కీమ్‌లు న్నాయి. చే తిపంపు నిర్వహణకు రూ.2 వేలు, ఎన్‌పీడబ్ల్యూ,పిడబ్ల్యూ స్కీమ్‌లకు రూ.లక్ష న్నర నుంచి 3లక్షల వరకు, సీపీడబ్ల్యూ స్కీమ్‌కైతే రూ.30లక్షల నుంచి రూ.60 లక్షల వ రకు మెయింటనెన్స్‌కు ఖర్చవుతుంటుంది. వీటిలో విద్యుత్ బిల్లులే అధికంగా ఉంటాయి. సీపీడబ్ల్యూ స్కీమ్‌ల నిర్వహణను జెడ్పీ, చేతిపంపుల మరమ్మతులను మండల పరిషత్‌లు, ఎన్‌పీ డబ్ల్యూ,పీడబ్ల్యూ స్కీమ్‌ల మరమ్మతు పనులను పంచాయతీలు పర్యవేక్షిస్తుండేవి. ఇప్పటి వరకు ఈ మొత్తాన్ని కేంద్రం ఏటా విడుదల చేసే ఆర్థిక సంఘం నిధుల నుంచి జెడ్పీ, మండల పరిషత్‌లే భరించేవి. 2015-16 నుంచి 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకే కేటాయించాలని నిర్ణయించడంతో వీటి నిర్వహణ భారాన్ని కూడా పంచాయతీలే భరించాలని సర్కార్ తేల్చి చెప్పింది.

జెడ్పీ, మండల పరిషత్‌కు ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులు లేకపోవడంతో ఇక నుంచి తాగునీటి పథకాల నిర్వహణ కయ్యేఖర్చుతో పాటు పంచాయతీల్లో ఉండే ప్రభుత్వ భవనాలకు రిపేర్లు, అంతర్గత సీసీ రోడ్లు,డ్రైన్లు, పంచాయతీ కార్యాలయ కంప్యూటరీకరణ వంటి ఆర్థిక సంఘం నిర్దేశించిన పనులన్నింటికి అయ్యే వ్యయాన్ని పంచాయతీలే భరించాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా గతంలో మహానేత వైఎస్సార్ తీసుకున్న నిర్ణయం మేరకు మొన్నటి వరకు ప్రభుత్వం భరించిన విద్యుత్ బిల్లుల చెల్లింపు భారాన్ని కూడా తిరిగి పంచాయతీలకే అప్పగించింది. ఏ స్కీమ్ ద్వారా ఏఏ పంచాయతీల పరిధిలోని గ్రామాలకు తాగునీరందుతుందో ఆయా పంచాయతీలే ఆ స్కీమ్‌ల నిర్వహణ భారం జనాభా ప్రాతిపదికన భరించాలని ప్రభుత్వం ఆదేశించింది. చేతిపంపుల మరమ్మతులు కూడా పంచాయతీలే చేపట్టాలని పేర్కొంది. ఆ మేరకు నిధులను జెడ్పీకి పంచాయతీలు జమచేయాలని ఆదేశించారు. ఈ నిధులను ఆర్‌డబ్ల్యూఎస్‌కు బదలాయించి స్కీమ్‌ల వారీగా నిర్వహణకు ఖర్చు చేయాలని సూచించింది. పనులను పర్యవేక్షించేందుకు ఇందుకోసం స్కీమ్‌ల వారీగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీల్లో స్కీమ్ పరిధిలోని పంచాయతీ సర్పంచ్‌లతో పాటు ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వాదేశాల మేరకు ఇటీవల పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులతో జెడ్పీ సీఈవో జయప్రకాష్‌నారాయణ్ సమావేశం నిర్వహించి వారి అంగీకారం తీసుకున్నారు.

మెజారిటీ సర్పంచ్‌లు ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించగా, కొందరు మాత్రం తాగునీటి పథకాల నిర్వహణతో పాటు విద్యుత్, టెలిఫోన్ తదితర బిల్లుల చెల్లింపులన్నీ ఈ నిధుల నుంచే మీట్ అవ్వాలంటే ఇక అభివృద్ధి పనులకు ఖర్చు చేసేందుకు ఏం మిగులుతుందని వాపోయారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్కీమ్‌ల నిర్వహణఖర్చులతో పాటు తాత్కాలిక మరమ్మతులకయ్యే మొత్తాన్ని మాత్రృమే భరిస్తాం తప్ప.. పెండింగ్ బిల్లులు, శాశ్వత మరమ్మతులకు ఖర్చు చేసే ప్రసక్తే లేదని వారు తెగేసి చెప్పారు. కాగా జిల్లాలో చాలా వరకు చేతిపంపులు మూలనపడ్డాయి. సీపీడబ్ల్యూ స్కీమ్‌లు పంపులు, ఫిల్టర్ బెడ్స్ పనిచేయక మొరాయిస్తున్నాయి. మరొక పక్క లక్షల్లో పేరుకు పోయిన విద్యుత్ బిల్లులు భయపెడుతున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement