వేలం ఆస్తులను కోర్టు ముందుంచిన సీఐడీ | Ten Agrigolds, 5 Akshaya Gold Assets in the list | Sakshi
Sakshi News home page

వేలం ఆస్తులను కోర్టు ముందుంచిన సీఐడీ

Apr 26 2017 2:02 AM | Updated on Mar 28 2019 5:27 PM

ప్రభుత్వ ఈ పోర్టల్‌ ద్వారా వేలం వేసేందుకు గుర్తించిన అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్‌ ఆస్తుల వివరాలను ఏపీ సీఐడీ అధికారులు మంగళవారం హైకోర్టు ముందుంచారు.

జాబితాలో పది అగ్రిగోల్డ్‌ , 5 అక్షయ గోల్డ్‌ ఆస్తులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఈ పోర్టల్‌ ద్వారా వేలం వేసేందుకు గుర్తించిన అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్‌ ఆస్తుల వివరాలను ఏపీ సీఐడీ అధికారులు మంగళవారం హైకోర్టు ముందుంచారు. ఇందులో 10 అగ్రిగోల్డ్‌ ఆస్తులు, 5 అక్షయ గోల్డ్‌ ఆస్తులు ఉన్నాయి. అగ్రిగోల్డ్‌ యాజమాన్యం సైతం 35 ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించింది. వీటిలో విశాఖపట్నంలో రూ.360 కోట్ల విలువైన ఆస్తులు, నెల్లూరులో రూ.360 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

తదుపరి విచారణ సమయంలో ఈ ఆస్తుల వేలానికి ఆటంకాలు ఉండవని భావిస్తున్నామన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఆ రోజున వేలం విధివిధానాలు, ప్రచారం తదితర విషయాలపై ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. కాగా తనపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ అగ్రిగోల్డ్‌ పూర్వ డైరెక్టర్‌ అవ్వా సీతారామారావు వేసిన పిటిషన్లపై మంగళవారం వాదనలు ముగిశాయి.  న్యాయమూర్తి జస్టిస్‌ అంబటి శంకరనారాయణ తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement