మూడు నెలల్లోనే తెలంగాణ | Telangana state resolution in three months: Sarvepalli satyanarayana | Sakshi
Sakshi News home page

మూడు నెలల్లోనే తెలంగాణ

Aug 18 2013 2:12 AM | Updated on Sep 1 2017 9:53 PM

‘చెన్నారెడ్డి అంత గొప్ప మేధావి దేశంలోనే లేడు.. సీమాంధ్రులు ఆయన్ను సంవత్సరం కూడా సీఎంగా పనిచేయనీయ లేదు..

సిద్దిపేట, న్యూస్‌లైన్: ‘చెన్నారెడ్డి అంత గొప్ప మేధావి  దేశంలోనే లేడు.. సీమాంధ్రులు ఆయన్ను సంవత్సరం కూడా సీఎంగా పనిచేయనీయ లేదు.. కేంద్రంలో మైనార్టీలో ఉన్నా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన పీవీ నర్సింహారావు వంటి మేధావిని అలాగే చేశారు.. 60 ఏళ్ల ఆంధ్రపదేశ్ పాలనలో తెలంగాణ నుంచి ముగ్గురే సీఎం లుగా పని చేశారంటే సీమాంధ్ర పాలనలో తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. నాడు ఇందిరాగాంధీ చేయలేని సాహసాన్ని సోనియా గాంధీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేశారు’ అని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల సహా య మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. శనివారం సిద్దిపేటకు వచ్చిన ఆయన ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజ లు మేలు చేస్తే మరచిపోరని.. అలాగని మోసం చేస్తే వది లి పెట్టే పరిస్థితి ఉండదన్నారు. 
 
 అప్పట్లో బీజేపీని బ్లాక్ మెయిల్ చేసిన టీడీపీ తెలంగాణ రాకుండా అడ్డుకున్న దన్నారు. అమ్మ స్వభావం, మనస్తత్వం తనకు తెలుసునని, తెలంగాణ ఇస్తే ఆంధ్రలో సీట్లు పోతాయని తెలి సినా ఇచ్చిన మాటకు కట్టుబడినట్లు చెప్పారు. సీడబ్ల్యూ సీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపిందని, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని వివరించారు. రెండు, మూడు నెలల్లోనే తెలంగాణ ఏర్పడుతుందన్నారు. మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు ఎందుకు ఉద్యమించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటుపై సీమాంధ్ర ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు. హైదరాబాద్‌ను అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించిన సీమాంధ్ర బడా బాబులు, వ్యాపారులు, కొందరు బ్రోకర్లే అక్కడ స్టేజి షోలు చేయిస్తున్నారని విమర్శించారు. వీహెచ్‌పై దాడిని ఆయన ఖండిస్తూ, ఇలాంటి సంఘటనలు వారికే నష్టమన్నారు. నరేంద్రమోడీ వెంట లీడర్.. క్యాడర్ ఏది లేదని, బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగినట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, పీసీసీ కార్యదర్శి గంప మహేందర్‌రావు తదితరులు కేంద్ర మంత్రి సర్వేను సన్మానించారు.

Advertisement
 
Advertisement
Advertisement