తెలంగాణ ఏర్పాటు తథ్యం | telangana state formation is confirm | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఏర్పాటు తథ్యం

Feb 2 2014 2:55 AM | Updated on Aug 13 2018 4:01 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని పీడీఎస్‌యూ నాయకులు స్పష్టం చేశారు.

 ఖలీల్‌వాడి,న్యూస్‌లైన్ :
 రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని పీడీఎస్‌యూ నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లును తిరస్కరించినందుకు నిరసనగా శనివారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ నగర అధ్యక్షుడు అన్వేష్ మాట్లాడుతూ.. తెలంగాణలో పుట్టి పెరిగి, ఇక్కడి  నీళ్లు తాగి,గాలి పీలుస్తున్న సీఎం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం వేలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకు న్నా, కిరణ్‌కుమార్‌రెడ్డి కనీసం స్పందించలేదని మండిపడ్డారు. సీఎంతో పాటు సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రజలపై వివక్ష చుపుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు సౌందర్య,అరుణ్, విజయ్,కిరణ్,నరేష్,రాజేశ్వర్,కమలకర్,ఉత్తేజ్,చక్రి,రవి తదితరులు పాల్గొన్నారు.
 
 కామారెడ్డిలో తలకాయలేని దిష్టిబొమ్మ దహనం
 కామారెడ్డి : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ తలకాయలేని కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను శనివారం కామారెడ్డిలో పీడీఎస్‌యూ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్‌ఎన్ ఆజాద్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే విషయంలో కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యం, నాన్చుడు ధోరణి వల్ల తెలంగాణ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. సాగదీసే విధానానికి స్వస్తిపలికి వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో పీడీఎస్‌యూ డివిజన్ అద్యక్ష, కార్యదర్శులు ఎల్‌బీరాజు, క్రాంతికుమార్, నాయకులు సురేశ్, ఓజల్, లావణ్య, మహేశ్, నరేశ్, వెంకటేశ్, సునీత, స్వప్న, దీపిక, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement