29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం
భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
హైదరాబాద్: భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రత్యేక రాష్ట్రానికి ప్రజల ఘనస్వాగతం పలికారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లోనూ వేడుకలు, సంబురాలు మిన్నంటాయి. పలు ప్రాంతాల్లో బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల సాకారమైంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, సంబురాలు ఘనంగా తెలంగాణవాదులు నిర్వహించారు. హైదరాబాద్ లోని గన్ పార్క్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పైకి పెద్ద సంఖ్యలో తెలంగాణవాదులు, ఉస్మానియా విద్యార్ధులు, కవులు, కళాకారులు, మేథావులు పాల్గొన్నారు. గన్పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి ప్రజా గాయకుడు గద్దర్ నివాళులర్పించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని తెలంగాణ పీసీసీ కార్యాలయం జరుపుకున్నారు. టీపీసీసీ కార్యాలయంలో ప్రారంభమైన వేడుకలకు పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్, దానం నాగేందర్ లు హాజరయ్యారు.