తెలంగాణ కోసం... మహిళా ఉద్యోగుల పోరు... | telangana Fighting female employees | Sakshi
Sakshi News home page

తెలంగాణ కోసం... మహిళా ఉద్యోగుల పోరు...

Sep 5 2013 4:12 AM | Updated on Sep 1 2017 10:26 PM

తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్న డిమాండుతో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం

ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్:తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్న డిమాండుతో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం నగరంలో భోజన విరామ సమయంలో  మహిళా ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. తొలుత, వివిధ శాఖలకు చెందిన ఉద్యోగినులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ ప్రదర్శనగా కలెక్టరేట్. జిల్లాపరిషత్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు నినాదాలు చేశారు. అనంతరం, అం బేద్కర్ విగ్రహానికి మహిళా ఉద్యోగ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తరువాత, కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా వెళ్లి, అక్కడ ఆందోళన నిర్వహించారు. ‘తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులు చేస్తున్న కపట ఉద్యమాలు ఆపాలి’, ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాలి’,
 
 ‘తెలంగాణ సాధనే మా లక్ష్యం’ అంటూ, నినాదాలు చేశారు. అక్కడ జరిగిన సభలో టీఎన్‌జీఓ అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు విజేత మాట్లాడుతూ.. తెలంగాణను అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకే సీమాంధ్రులు ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణను అడ్డుకోవాలని చూస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం మహిళా నాయకురాలు వాణి శ్రీ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం మహిళా ఉద్యోగులు కూడా ఆందోళనలకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సకల జనుల సమ్మెలో సైతం 42 రోజులపాటు ఉద్యమంలో పాల్గొని సత్తా చాటారని చెప్పారు. తెలంగాణ సాధనే అందరి లక్ష్యమని అన్నారు. తెలంగాణను అడ్డుకోవాలని చూసేవారికి పుట్టగతులుండవని హెచ్చరించారు.
 
 రాజకీయ నాయకులు కూడా ఉద్యమంలోకి రావాలన్నారు. తెలంగాణ ఏర్పడేంతవరకు ఉద్యమం ఆగదన్నారు. టీజీఓ మహిళా విభాగం కార్యదర్శి వెంకటనర్సమ్మ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను సీమాంధ్రులు మానుకోవాలన్నారు. టీచర్స్ యూనియన్ నాయకురాలు నాగమణి మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టాలని, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళా నాయకులు బిఎంఎల్.సరోజ,లక్ష్మిదేవి,  నాగేంద్రకుమారి, సక్కుబాయి, శైలజ, సౌజన్య, భాగ్యవతి, ఉపేంద్ర, మేరి, లక్ష్మి, సుజాత, శారద, సంధ్యారాణి, కాంతకుమారి, భారతి, సునంద, మంజుల, ఉషా, బంగారమ్మ, రజియా, భాగ్యలక్ష్మి, పద్మ, వసంత, అనూరాధ, జ్యోతి, రాంబాయి తదితరులు పాల్గొన్నారు.
 మహిళా ఉద్యోగుల ఆందోళనకు ఉద్యోగ జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు కూరపాటి రంగరాజు, నడింపల్లి వెంకటపతిరాజు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌కె.ఖాజామియా సంఘీభావం తెలిపారు.
 
 ఇఫ్టూ ఆధ్వర్యంలో ర్యాలీ
 ఇల్లెందు అర్బన్: హైదరాబాదుతో కూడిన తెలంగాణ ఇవ్వాలని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని, పోల వరం ప్రాజెక్టు రద్దు చేయాలనిడిమాండ్ చేస్తూ బుధవారం ఇఫ్టూ ఆధ్వర్యంలో ఇల్లెందులో సద్భావన శాంతి ర్యాలీ జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా నుంచి జగదాంబ సెంటర్, ఆంబజార్ మీదుగా పాత బస్టాండ్ ఏరియా వరకు ఈ ర్యాలీ సాగింది. అనంతరం, అక్కడ ఏర్పాటైన సభలో టీజేఏసీ డివిజన్ కన్వీనర్ అప్పారావు మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేంత వరకు ప్రజలు ఉద్యమించాలని కోరా రు. సీమాంధ్రులను సీఎం కిరణ్, చంద్రబాబు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర పెట్టుబడిదారులు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, నాయకులు రమేష్, రాసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement