పుష్కరాలకు పాదగయ క్షేత్రం రూపు మార్చేస్తామన్నారు.. అనేక మంది దేవాదాయ శాఖ అత్యున్నత అధికారులు వచ్చి
పిఠాపురం :పుష్కరాలకు పాదగయ క్షేత్రం రూపు మార్చేస్తామన్నారు.. అనేక మంది దేవాదాయ శాఖ అత్యున్నత అధికారులు వచ్చి ఇది ప్రాచీన ఆలయమని, మాస్టర్ ప్లాన్తో దీని రూపురేఖలు మార్చేస్తామని ప్రగల్బాలు పలికారు. హడావిడిగా పనులూ ప్రారంభించారు. తీరా చూస్తే నిధులు లేవు. ఫలితంగా ప్రారంభించిన పనులు నిలిచిపోయాయి. పుష్కరాలు సమీపిస్తున్నాయి. ఇప్పటివరకు ఒక్కపని కూడా పూర్తికాలేదు. పుష్కర పనుల పేరుతో రూ.కోటి విలువైన వసతిగృహం కూల్చేశారు. కనీసం దుస్తులు మార్చుకునే గదిని కూడా నిర్మించలేదు. దీంతో ఇదేనా మాస్టర్ ప్లాన్ అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
పుష్కరాల నేపథ్యంలో పాదగయ క్షేత్రం అభివృద్ధికి మొదటి విడతగా రూ.40 లక్షలు విడుదలయ్యాయి. వీటితో ఆలయ గోపురాలకు రంగులు వేసే పనులను నెల రోజుల నుంచి చేపట్టారు. దీంతోపాటు మహిళలు దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అప్పట్లో ప్రకటించారు. దీంతో రంగుల పనులతోపాటు గదుల నిర్మాణాలను ప్రారంభించారు. మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు రూ.18 లక్షలతో ఆలయ ప్రాంగణంలో గ్రానైట్ రాయి వేయించే పనులు చేపడతామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఆలయానికి రంగులు వేసే పనులే పూర్తికాలేదు. పైగా నిధుల లేమితో నిలిచిపోయాయి.
కేవలం రెండు సాధారణ రంగులు వేసి పనులు నిలిపి వేశారు. ఇంకా ఆలయ గోపురాలపై విగ్రహాలకు పంచ రంగులు వేయాల్సి ఉంది. అలాగే ఆలయ గోపురాలపై విగ్రహాలను మరమ్మతులు చేయాల్సి ఉంది. మరుగుదొడ్ల నిర్మాణం అసలు ప్రారంభమే కాలేదు. అలాగే స్త్రీలు దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణం పిల్లర్స్ స్థాయిలో ఆగిపోయింది. అయినా అధికారులు పట్టించుకోవట్లేదు. ఉన్న వసతి గదిని కూలగొట్టేసిన అధికారులు కొత్తపనులు చేపట్టకపోతే పాదగయ క్షేత్రానికి వచ్చే పుష్కర భక్తులకు ఇబ్బందులు తప్పవని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై ఆలయ ఈఓ చందక దారబాబును వివరణ కోరగా పనులు త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు.