పరిగిలో టీడీపీ నేతల దౌర్జన్యం | TDP leaders considered assault | Sakshi
Sakshi News home page

పరిగిలో టీడీపీ నేతల దౌర్జన్యం

Oct 26 2014 3:36 AM | Updated on Sep 2 2017 3:22 PM

పరిగి : మరుగు దొడ్డి నిర్మాణ సామగ్రిని రోడ్డుపై కాకుండా పక్కకు ఉంచుకోవాలని సూచించిన పాపానికి వైఎస్‌ఆర్ సీపీ నేతపై టీడీపీ నేతలు దాడి చేశారు.

వైఎస్‌ఆర్ సీపీ నేతపై దాడి
 
 పరిగి : మరుగు దొడ్డి నిర్మాణ సామగ్రిని రోడ్డుపై కాకుండా పక్కకు ఉంచుకోవాలని సూచించిన పాపానికి వైఎస్‌ఆర్ సీపీ నేతపై టీడీపీ నేతలు దాడి చేశారు.  బాధితుడు అనిల్‌కుమార్ తెలిపిన మేరకు... పి.నరసాపురం గ్రామ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్డి నిర్మాణాన్ని అదే గ్రామానికి చెందిన టీడీపీ మద్దతుదారు సర్పంచ్ వర్గీయులు శుక్రవారం చేపట్టారు. అందుకు సంబంధించిన సామగ్రిని వారు రోడ్డుపై ఉంచుకుని పనులు చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన వైఎస్‌ఆర్ సీపీ నేత అరుణ్‌కుమార్ రోడ్డుకు అడ్డంగా ఉంచిన సామగ్రిని పక్కకు వేసుకోవాలని సూచించాడు.

ఆ సమయంలో వాగ్వాదం చోటు చేసుకుని అరుణ్‌కుమార్‌పై వారు దాడి చేశారు. ఘటనపై అదే రోజు సాయంత్రం పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఘటనకు బాధ్యులను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేస్తామని పోలీసులు చెప్పి పంపారు. శనివారం ఉదయాన్నే అరుణ్‌కుమార్‌పై సర్పంచ్ వర్గీయులు మరోసారి దాడికి తెగబడ్డారు. వారి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్ వైపు అరుణ్‌కుమార్ పరుగు తీశాడు.  జరిగిన విషయాన్ని ఎస్‌ఐ రంగడుకు వివరించారు.

విషయం తెలుసుకొన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు  శంకర నారాయణ పరిగి పోలీస్ స్టేషన్‌లో ఉన్న అరుణ్ కుమార్‌ను పరామర్శించి, దాడికి గల కారణాలను అడిగి తెలుసుకొన్నారు. ఎస్‌ఐతో చర్చించారు.  సర్పంచు వర్గీయులు కావాలనే తమ పార్టీ నాయకుడిపై దాడి చేసారన్నారు. వెంటనే దాడి చేసిన వారిపై చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ న్యాయం జరగకపోతే విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళతామని అన్నారు. దాడి చేసిన వారిపై తప్పక చర్యలు తీసుకొంటామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement