‘విద్యుత్‌’ కార్మికుడిపై టీడీపీ నేత దాడి

TDP Leader Attack On Electricity Contract Employee In Guntur District - Sakshi

మీటరు బయట పెట్టుకోమన్నందుకు ఆగ్రహం

కాల్చేస్తానంటూ రివాల్వర్‌తో బెదిరింపు

కాళ్లతో తన్ని.. చేతులతో పిడిగుద్దులు

పోలీసుస్టేషన్లో బాధితుడి ఫిర్యాదు

ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

సాక్షి, రాజుపాలెం/పిడుగురాళ్ళ(సత్తెనపల్లి/గురజాల):  అధికార పార్టీకి చెందిన నేతల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. తాజాగా విద్యుత్‌ మీటరు బయట పెట్టుకోమన్నాడన్న కోపంతో ..తెలుగు యువత నాయకుడొకరు మీటరు రీడింగ్‌ చేసే కాంట్రాక్టు ఉద్యోగిని నానా దుర్భాషలాడుతూ చితకబాదిన ఘటన గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలోని పెదనెమలిపురి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం పెదనెమలిపురి గ్రామానికి చెందిన మండల టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు ముప్పాళ్ల బాలకృష్ణ ఇంటికి శుక్రవారం విద్యుత్‌ మీటరు రీడింగ్‌ తీసేందుకు మెరుగు గౌరీశంకర్‌ అనే కాంట్రాక్టు ఉద్యోగి వెళ్లాడు. తలుపు వేసి ఉండడంతో తలుపును కొట్టగా బాలకృష్ణ బయటకొచ్చి ప్రశ్నించాడు. మీటరు రీడింగ్‌ తీయడానికి వచ్చానని,  మీటరును బయట బిగించాలని చెప్పాడు. దీంతో బాలకృష్ణ ఆగ్రహంతో అతడిని బయటకు నెట్టి  ఇష్టమొచ్చినట్లు  తిడుతూ కణతపై రివాల్వర్‌ గురిపెట్టి కాల్చి చంపుతా అంటూ కాళ్లతో తన్నుతూ చేతులతో పిడిగుద్దులు కురిపించాడు. 

గతంలోనూ ఇదే విధంగా దాడి.. 
నాలుగు నెలల క్రితం ఇదేవిధంగా ముప్పాళ్ల బాలకృష్ణ ఇంట్లో మీటరు రీడింగ్‌ తీయడానికి వెళ్లిన వల్లెల ప్రసాదుపై రివాల్వర్‌తో దాడి చేయడంతో బాధితుడు హడలిపోయి ఉద్యోగమే మానుకున్నాడని తోటి ఉద్యోగులు తెలిపారు. మీటరు రీడింగ్‌ తీయడానికి వెళ్లిన మరో కార్మికుడు సానికొమ్ము చంద్రశేఖర్‌రెడ్డిపై అదేవిధంగా దాడి చేయడంతో అతడిని వేరే గ్రామాలకు  మార్చి అతని స్థానంలో మెరుగు గౌరీశంకర్‌ను నియమించారు. 

కాంట్రాక్టర్‌ ఫిర్యాదు.. 
వరుసగా మీటరు రీడింగ్‌ కార్మికులపై దాడులు చేయడంతో ముప్పాళ్ల బాలకృష్ణపై కాంట్రాక్టర్‌ ఆర్‌వీ నారాయణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు

దాడి కేసు నమోదు
మీటరు రీడింగ్‌ చూసేందుకు వచ్చిన కాంట్రాక్టు ఉద్యోగిపై ముప్పాళ్ల బాలకృష్ణ రివాల్వర్‌ గురిపెట్టి చితకబాదారని, ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ పిడుగురాళ్ల పట్టణ విద్యుత్‌ శాఖ ఏఈ కార్యాలయంలో ఏఈ భగవాన్‌నాయక్‌కు బిల్లింగ్‌ కాంట్రాక్టర్‌ ఆర్‌వీ నారాయణరావు శనివారం అర్జీ ఇచ్చారు. గౌరీశంకర్‌ శుక్రవారం రాత్రి యూనియన్‌ నాయకులతో కలసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. శనివారం పిడుగురాళ్ళ సీఐ సుబ్బారావు బాధితుడు గౌరీశంకర్‌ను జరిగిన విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. తెలుగు యువత నాయకుడు బాలకృష్ణపై ఎఫ్‌ఐఆర్‌ కడితే కానీ ఇక్కడ నుంచి కదలబోమని యూనియన్‌ నాయకులు పట్టుబట్టడంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు దాడి చేసినట్టు కేసు నమోదు చేíఠిbÜ ఎఫ్‌ఐఆర్‌ కాపీని యూనియన్‌ నాయకులకు అందజేశారు. మాచర్ల డివిజన్‌కు చెందిన విద్యుత్‌ యూనియన్‌ నాయకులు పి.శ్రీనివాసరావు, ఎం.బలరామకృష్ణ, గుజ్జర్లపూడి ప్రవీణ్‌కుమార్, గొల్లమండి శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.ఆంజనేయులునాయక్‌ తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top