సంక్షామం! | TDP government 8 months ruling undermined the welfare schemes | Sakshi
Sakshi News home page

సంక్షామం!

Feb 13 2015 11:59 PM | Updated on Aug 10 2018 8:13 PM

సంక్షామం! - Sakshi

సంక్షామం!

ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు.. మీ సంక్షేమం మా బాధ్యత అంటూ చంద్రబాబు మొదలుకొని...

టీడీపీ 8 నెలల పాలనలో సంక్షేమ పథకాలకు తూట్లు
కొత్త పింఛన్లు లేవు..రద్దయినవి పునరుద్ధరణ కావు
కొత్త రేషన్ కార్డుల ఊసే లేదు
పడకేసిన పక్కా ఇళ్ల నిర్మాణాలు

 
పాలకొండ : ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు.. మీ సంక్షేమం మా బాధ్యత అంటూ చంద్రబాబు మొదలుకొని కిందిస్థాయి టీడీపీ నేతల వరకు వాగ్దానాల వర్షం కురిపించారు. ఎన్నికలు ముగిశాయి. టీడీపీ చేతికి అధికార పగ్గాలు వచ్చాయి. ఎనిమిది నెలలు గడిచినా సంక్షేమం ఊసు లేదు. ఒకవైపు సింగపూర్ తరహా రాజధాని.. మరోవైపు స్మార్ట్ సిటీలు, గ్రామాలు అంటూ హడావుడి చేస్తున్న పాలకులు.. సామాన్య ప్రజల కనీస అవసరాల గురించి పట్టించుకోవడంలేదు.

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో కీలకమైన.. పేదలకు అత్యవసరమైన.. వారు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఇళ్లు, రేషన్‌కార్డులు, పింఛన్ల మంజూరు చేయాలన్న విషయాన్నే విస్మరించారు. జియో ట్యాగింగ్ పేరుతో పెండింగులో ఉన్న ఇళ్ల బిల్లులకు మోక్షం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో పేదలకు ఒక్క ఇల్లయినా మంజూరు కాలేదు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎదురుచూపులే మిగులుతున్నాయి. పింఛన్ల కోసం సుమారు 50 వేల మంది దీనంగా ప్రభుత్వం వైపు చూస్తున్నారు. జిల్లాలో ఈ మూడు సంక్షేమ కార్యక్రమాల తాజా పరిస్థితి ఒక్కసారి పరిశీలిస్తే..

పింఛన్లకు 50 వేల మంది ఎదురుచూపు

వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్లే ఆధారం. అటువంటి పింఛనుదారులను రద్దుల పద్దుతో ప్రభుత్వం ఆందోళనకు గురి చేస్తోంది. జన్మభూమి కమిటీల ద్వారా సర్వే జరిపించి అనర్హత పేరుతో జిల్లా వ్యాప్తంగా 35 వేల పింఛన్లు తొలగించిన విషయం తెలిసిందే. ఆ పేరుతో వేలాదిమంది అర్హులపైనా వేటు వేశారు. ఇది అన్యాయమని అటువంటి వారు గగ్గోలు పెట్టడంతో తిరిగి దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని ప్రభుత్వం చెప్పింది. అలా మళ్లీ దరఖాస్తు చేసుకున్న వారితోపాటు కొత్తగా పింఛను కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు.

అప్పట్లో నిర్వహించిన జన్మభూమి గ్రామసభల్లో జిల్లావ్యాప్తంగా 50 వేల వరకు దరఖాస్తులు అందాయి. ఆ దరఖాస్తులకు ఇప్పటికీ మోక్షం లేదు. ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు జారీ చేయకపోవడంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. అర్హత ఉన్నా పింఛన్లు లేక వృద్ధులు అధికారుల చుట్టూ తిరుగుతుంటే.. ఈ నెల, వచ్చే నెల అంటూ అధికారులు కాలం నెట్టుకొస్తున్నారు.

 బిల్లులకు 27వేల మంది
 ఇళ్ల కోసం 35 వేల మంది

ప్రభుత్వం అమలు చేస్తున్న పలు గృహ నిర్మాణాల పరిస్థితి పూర్తి గందరగోళంలో పడింది. లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. జియో ట్యాగింగ్ పేరుతో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్ల లబ్ధిదారులకు కోట్లాది రూపాయల బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేస్తోంది. సుమారు 27 వేల మంది ఈ బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

బిల్లులు వస్తాయన్న ఆశతో అప్పులు చేసి నిర్మాణాలు పూర్తి చేసిన వారు వాటికి వడ్డీలు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా 35 వేల మంది పేదలు ఇళ్ల నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకొని నిరీక్షిస్తున్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు ఒక్క ఇళ్లు కూడా కొత్తగా ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో  వీరికి ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఈ పరిస్థితి ఎన్నాళ్లు  కొనసాగుతుందన్న దానికి ఉన్నతాధికారుల వద్ద కూడా సమాధానం లేదు.

రేషన్ పరేషాన్...

జిల్లాలో రేషన్‌కార్డుల విషయంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. జన్మభూమి సభల్లో, గ్రీవెన్స్ సందర్భంగా ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న 43 వేల మంది కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తుంటే, సర్వే కమిటీల పుణ్యమా అని ఉన్న కార్డులు కోల్పోయిన బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆన్‌లైన్ సమస్యల అంటూ ఇప్పటివరకు 4 వేల కార్డులు ఎక్కడున్నాయో కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొంది. వీటిపై ఏం చేయాలో తెలియని అధికారులు, ఆ లబ్ధిదారులతో కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేయించారు. అయితే కొత్త కార్డులు ఎప్పుడు మంజూరవుతాయన్నది మాత్రం వారు చెప్పలేకపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement