టీడీపీ: పోటీ చేద్దామా..? వద్దా..!  | TDP Candidates Confusing To Participate In Panchayati Elections | Sakshi
Sakshi News home page

టీడీపీ: పోటీ చేద్దామా..? వద్దా..! 

Jun 25 2019 10:53 AM | Updated on Jun 25 2019 10:56 AM

TDP Candidates Confusing To Participate In Panchayati Elections - Sakshi

సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించింది. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో తనదైన ముద్రతో ముందుకు సాగుతున్నారు. ప్రజాభిమానం పొందుతున్నారు. అదే ఉత్సాహంతో స్థానిక పోరుకు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు కదులుతున్నాయి. మరోవైపు టీడీపీ నాయకులు బీజేపీలో కలిసిపోతుండడం.. రాష్ట్రంలో అసలు పార్టీ ఉంటుందో లేదోనన్న బెంగతో పార్టీ శ్రేణులు చెల్లాచెదురవుతున్నాయి. స్థానిక పోరులో పోటీకి వెనుకంజవేస్తున్నాయి. అసలు బరిలో నిలవాలా వద్దా అన్న సందిగ్ధతలో కొట్టుమిట్టాడుతున్నాయి. వాస్తవంగా గతేడాది ఆగస్టులో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు మొగ్గుచూపకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. పంచాయతీ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అవి అయిపోగానే వెంటనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తుండడంతో తగిన విధంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. విజయనగరం జిల్లాలోని 34 మండలాల్లో 919 గ్రామ పంచాయతీలు ఉండగా... మొత్తం 14,80,099 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 7,33,372 మంది కాగా... మహిళా ఓటర్లు 7,46,671 మంది ఉన్నారు.  ఇతరులు మరో 56 మంది వరకు ఉన్నట్లు అధికారిక వర్గాలు లెక్కతేల్చాయి.  ఈ ఓటర్లు పంచాయతీలకు సర్పంచ్‌లను ఎన్నుకోవడంతోపాటు ఆయా గ్రామాల్లోని వార్డు సభ్యులను ఎన్నుకోవాల్సిఉంది.

వైఎస్సార్‌సీపీ జోష్‌.. టీడీపీ డీలా
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయబావుటా ఎగురవేసి క్లీన్‌ స్వీప్‌ చేయటంతో  పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓటర్లు భారీ మెజారిటీని అందించారు. టీడీపీకి పట్టున్న గ్రామాల్లో సైతం వైఎస్సార్‌సీపీ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. దీంతో అధికారపార్టీ వైఎస్సార్‌సీపీ కేడర్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది. టీడీపీ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన వ్యక్తి ప్రజల్లో కనిపించడం లేదు. ఘోర పరాజయంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యారు.

చాలా గ్రామాల్లో టీడీపీ నేతలు చెల్లాచెదురయ్యారు. దీనికితోడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పార్టీ అధినాయకుడు చంద్రబాబు పోలింగ్‌ తరువాత గట్టి ధీమా వ్యక్తం చేయడంతో ఆయన మాటలు నమ్మి అనేక మంది నేతలు, కార్యకర్తలు బెట్టింగ్‌లకు దిగి తీవ్రంగా నష్టపోయారు. అంతేగాక ఎన్నికల్లో అధిక మొత్తంలో ఖర్చు పెట్టిన అంచనాలకు అందని పరాజయం కూడా అభ్యర్థులను కుంగదీసింది.

పంచాయతీ ఖర్చుపై చర్చ
జిల్లాలో ఎన్నికలు ఆర్థికంగా భారంగా మారాయి. ఒక్కో ఓటుకు రూ.2 వేలు నుంచి రూ.3వేలు  వెచ్చించి పార్టీలు ఓట్లు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఓటర్లు ఎన్నికలతో నిమిత్తం లేకుండా ఎవరికైనా సరే తమకు ఎంత ఇస్తారనే కోణంలోనే ఆలోచిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటరుకు రూ.1000 నుంచి రూ.3 వేల వరకు పంచాల్సి వస్తుందేమోనని నేతలు దీర్ఘాలోచనలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు ఆర్థికంగా మోయలేని భారంగా ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేసినా.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మాదిరి ఓటమి పాలైతే అప్పులు తప్ప మిగిలేదీ  ఏమి ఉండదన్న భావన టీడీపీ శ్రేణులను వెంటాడుతోంది. ఇప్పటికిప్పుడు రూ.లక్షల్లో ఖర్చు చేసి ఎన్నికల్లో నిలబడేందుకు టీడీపీ కేడర్‌ సిద్ధంగా లేదన్న భావన వ్యక్తమవుతోంది. 

ఆర్థిక సాయం అందిస్తే ఆలోచిస్తాం..  
ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా పంచాయతీల్లో ప్రతిపక్ష టీడీపీ నేతలు నగదు సాయం చేస్తేనే పంచాయతీ ఎన్నికల్లో నిలబడాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో లేకపోవడంతో ఓటర్లు ఎంతవరకు తమ పార్టీకి సహకరిస్తారనే సంశయం కూడా ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా వదిలేస్తే పార్టీ కేడర్‌ మరింత దెబ్బతింటుందనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలా.. వదిలేయాలా అనే సందిగ్ధంలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. 

రిజర్వేషన్లు ఖరారే తరువాయి...!
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేశారు. రాష్ట్రంలో గత ఎన్నికల్లో 65.94 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. ఇందులో బీసీలకు 39.39 శాతం, ఎస్సీలకు 18.30, ఎస్టీలకు 8.25 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దీన్ని 50శాతానికి లోబడి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉన్నందున 15.94 శాతం తగ్గించాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.

మరో వైపు గత ఐదు విడతల పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు రొటేషన్‌ విధానంలో కేటాయించారు. దీంతో ఈసారి రొటేషన్‌కు భిన్నంగా గత రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకోకుండా ఖరారు చేయాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వం ముందున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో స్పష్టత రానుండగా.. వీలైనంత తర్వగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి, ఆపై మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు, అనంతరం పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం.. ఎన్నికల కమిషన్‌ సిద్ధమవుతున్నాయి.

గ్రీన్‌సిగ్నల్‌ వస్తే రెండు దశల్లో ఎన్నికలు
కులగణన పూర్తిచేసిన అనంతరం ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే ఎన్నికల సంఘం రంగంలోకి దిగుతుంది. దీనికి అనుగుణంగా మండలం లేదా రెవెన్యూ డివిజన్‌ను ఒక యూనిట్‌గా తీసుకొని సిద్ధం చేసే అవకాశం ఉంది. జిల్లా పంచాయతీ అధికారులు జిల్లాలో రెండు దశల్లో ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ పరిశీలనకు పంపారు. మొదటిగా విజయనగరం రెవెన్యూ డివిజన్‌లోని 19 మండలాల గ్రామ పంచాయతీలకు, అనంతరం పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌లోని 15 మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరిగేందుకు హెచ్చు అవకాశాలు ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement