అంటీముట్టనట్టు..! | T.G. Venkatesh maintained utmost silence | Sakshi
Sakshi News home page

అంటీముట్టనట్టు..!

Nov 12 2014 3:22 AM | Updated on Sep 2 2017 4:16 PM

అంటీముట్టనట్టు..!

అంటీముట్టనట్టు..!

ఆయన ఓ మాజీ మంత్రి.. గతంలో జిల్లాలో పవర్ సెంటర్‌గా కొనసాగారు. అప్పట్లో అధికార యంత్రాంగం ఆయన చెప్పినట్లే నడిచింది.

సాక్షి, కర్నూలు: ఆయన ఓ మాజీ మంత్రి.. గతంలో జిల్లాలో పవర్ సెంటర్‌గా కొనసాగారు. అప్పట్లో అధికార యంత్రాంగం ఆయన చెప్పినట్లే నడిచింది. ఆయన నివాసం, హోటల్.. నిత్యం కార్యకర్తలు, అధికారులతో సందడిగా ఉండేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ఎన్నికల ముందు పార్టీ మారిన ఆయన తన వైరివర్గంతో కలవలేకపోతున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రజా సమస్యలపై నోరు మెదపడం లేదు. ఒకప్పుడు అన్నీ తానై నడిపించిన ఆయన.. ప్రస్తుతం పార్టీ కార్యాలయం గడప తొక్కడం లేదు.

 మాజీ మంత్రి, టీడీపీ నేత టీజీ వెంకటేష్ మౌనం దాల్చారు. పార్టీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ప్రతిపక్ష పార్టీ నుంచి వస్తున్న విమర్శలకూ బదులివ్వడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన్మభూమి కార్యక్రమాన్ని జిల్లాలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అన్నీ తామై నడిపించారు. ఈ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది.

ఇప్పటివరకు టీజీవీ ఒక్కటంటే ఒక్క కార్యక్రమంలో పాల్గొనలేదు. ఇది ప్రభుత్వ కార్యక్రమమనుకున్నా...పార్టీ పరంగా జరుగుతున్న సభ్యత్వ నమోదులోనూ ఆయన పాత్ర నామమాత్రంగానే ఉంది. ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. తన చిరకాల వైరివర్గం అధికారాన్ని చెలాయిస్తుండాన్ని ఆయన తట్టుకోలేక.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న ప్రచారమూ జరుగుతోంది.

అదే బాటలో ఆయన అనుచరగణం కూడా పార్టీ కార్యాలయంలో కాలు పెట్టడం లేదని తెలుస్తోంది. ఏదైనా పార్టీ కార్యక్రమం అంటే ‘మా సారు హోటల్‌లోనే’ అని బాహాటంగా అంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కర్నూలు కార్పొరేషన్‌కు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో టీజీవీ వైఖరి అధికారపార్టీని కొంత కలవరపాటుకే గురిచేస్తోందని సమాచారం.

 నీరు రాకున్నా నోరు పెగలదే...!
 రాష్ట్ర విభజనపై నిరంతరం ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లో ఉండే టీజీ వెంకటేష్.. విభజన అనంతరం ఆయన ఒక్కటంటే ఒక్కమాట మాట్లాడటం లేదు. శ్రీశైల జలాలను వినియోగించుకొని తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ.. కర్నూలుకు నీరు రాకుండా చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు మొత్తుకుంటున్నా టీజీ వెంకటేష్ మాత్రం మాట్లాడటం లేదు. తెలంగాణ ప్రాంతంలో ఆయనకు ఆస్తులు ఉండటమే ఇందుకు కారణమని రాజకీయవర్గాల్లో ప్రచారం ఉంది.

వీటి సంగతి అలా ఉంచినా... మిగిలిన ప్రజా సమస్యల మీద కూడా ఆయన కనీసం పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. కర్నూలు నగరంలో పింఛన్లు, రేషన్‌కార్డుల ఏరివేతలో భాగంగా వేలాది మంది పేర్లను తొలగించారు. అయినా ఈ విషయంపైనా ఆయన నోరుమెదపడం లేదు.

కర్నూలు మునిసిపాలిటీ పరిధిలో అంతోఇంతో పట్టున్న నేతగా ఆయనకు పేరుంది. అనేక దఫాలుగా కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదటి నుంచీ వైరం ఉన్న కేఈ సోదరుల ఆధిపత్యం పెరుగుతుండటం... మరోవైపు మునిసిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి ఎత్తులు వేయనున్నారన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

 వైఎస్సార్‌సీపీ రాకతో...
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాకతో ఆయన హవాకు బ్రేకులు పడ్డాయనే చెప్పాలి. ఆయనకు ప్రధాన అనుచరులైన నర్సింహులు యాదవ్ సోదరులు, అలాగే స్టాండింగ్ కమిటీ చైర్-పర్సన్ గిరిజారెడ్డి భర్త తిమ్మారెడ్డి వైఎస్సార్‌సీపీలోకి చేరడంతో ప్రస్తుతం నగరంలో ఆయన బలం తగ్గింది.

ఇక టీడీపీలోనూ నగరంలో మూడు గ్రూపులు ఉండడంతో టీజీ వెంకటేష్ హవా ఈసారి ఎన్నికల్లో ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక నగరంలో కేఈ సోదరుల హవా కొనసాగుతుండడం, మరోవైపు మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి వర్గం, విష్ణువర్ధన్‌రెడ్డి వర్గం ఎవరికి వారు అధిపత్యం చలాయించే పనిలో నిమగ్నమయ్యాయి.

 సీఎం సభకూ చుట్టపుచూపే..!
 గతంలో అన్నీ తానై నడిపిన టీజీ వెంకటేశ్ ప్రస్తుతం టీడీపీ కార్యాలయానికి కూడా రావడం లేదు. ఇప్పటి వరకూ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆయన గడప తొక్కకపోవడం గమనార్హం. ఆయన అనుచరులూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీ కార్యాలయానికి కూడా రావడం లేదు. పార్టీ కార్యాలయానికి రావలసిన అవసరం మాకేంటని బిహ రంగంగానే చెబుతున్నారు.

గత ఎన్నికల సందర్భంగా కర్నూలులో చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాటు చేస్తే టీజీ అంతా తానై సభను నడిపించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వస్తే ఏదో చుట్టపుచూపుగా వచ్చినట్లు సభకు హాజరవ్వడం విశేషం.

 ఎన్నికల్లో సత్తా చాటి..
 మరో నెలలో కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. టీడీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. టీజీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటి, స్థానిక కోటా కింద ఎమ్మెల్సీ పదవిని పొందాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

గత పాలక మండలిలో చూస్తే.. 34 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు విజయం సాధించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోగా, అందులో 23 మంది టీజీవీకి చెందిన కార్పొరేటర్లు ఉండడం గమనార్హం. మేయర్, స్టాండింగ్ కమిటీల్లో ఆయన వర్గానికే అగ్రతాంబూలం. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో టీజీ వెంకటేష్ ప్రత్యేకత చాటుకునేవారు. అయితే ఈసారి అది పునరావృతం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement