దుబ్బు చేసే దశలో ఉన్న వరి పంటలో నీరు పలుచగా అంటే 2 నుంచి 3 సెం.మీ. మించకుండా చూసుకున్నట్లైతే ఎక్కువ పిలకలు తొడిగి అధిక దిగుబడి సాధించవచ్చు.
వరి : దుబ్బు చేసే దశలో ఉన్న వరి పంటలో నీరు పలుచగా అంటే 2 నుంచి 3 సెం.మీ. మించకుండా చూసుకున్నట్లైతే ఎక్కువ పిలకలు తొడిగి అధిక దిగుబడి సాధించవచ్చు.
చెరకు: 45 రోజుల చెరకు పంటకు సిఫారసు చేసిన మొదటి దఫా నత్రజని ఎరువును ఇప్పుడు అందించాలి. ఎకరానికి శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల్లో చెరకు పొలాల్లో 22.5 కిలోలు, గోదావరి జిల్లాల్లో 33.5 కిలోలు, రాయలసీమ జిల్లాల్లో 45 కిలోలు, మెదక్ జిల్లాలో 22.5 కిలోలు, మిగిలిన తెలంగాణా జిల్లాల్లో 50 కిలోల చొప్పున నత్రజని ఎరువును మొదటి దఫాగా ఇప్పుడు పంటకు అందించాలి.
బత్తాయి: పంటను బెట్టకు గురిచేసిన తరువాత నీరు పెట్టిన 20-30 రోజుల్లో పంటలో సూక్ష్మధాతు లోపాలు బహిర్గతమౌతాయి. అందువల్ల లీటరు నీటికి 5 గ్రా. జింక్సల్ఫేట్, 2 గ్రా. ఫై సల్ఫేట్, 1 గ్రా. బొరాక్స్, 2 గ్రా. మాంగనీస్ సల్ఫేట్, 2 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్, 6 గ్రాముల సున్నంతోపాటు 10 గ్రా. యూరియా కలిపిన మిశ్రమాన్ని విప్పారిన లేత ఆకుల మీద, పిందెలు బఠాణి పరిమాణంలో ఉన్నప్పుడు పిచికారీ చేయాలి.
బెండ: బెండ పంటను పచ్చదోమ, తెల్లదోమ ఆశిస్తోంది. తెల్లదోమ ద్వారా వైరస్ వ్యాపించి పల్లాకు తెగులు సోకే అవకాశం ఉంది. తెల్లదోమ నివారణకు 1.5 గ్రాముల అసిఫేట్ 4 లేదా 5 మి.లీ. ట్రైజోఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొలంలో అక్కడక్కడా పసుపు రంగు డబ్బాలకు గ్రీజు గానీ, ఆముదం గానీ పూసి తెల్లదోమను ఆకర్షింపజేసి నాశనం చేయాలి.
- వ్యవసాయ విస్తరణ సంచాలకులు
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్
శాస్త్రవేత్తల సలహాలకు ఉచిత ఫోన్ నంబర్లు
1100, 1800 425 1110
కిసాన్ కాల్ సెంటర్ :1551